నెలకు రూ.6 వేలు, ఏడాదికి రూ.72 వేలు, 20 శాతం పేదలకు ప్రయోజనం : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : పేదలే లక్ష్యంగా భారీ పథకాన్ని ప్రకటించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. నెలకు రూ.6 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. దీంతో వారి ఖాతాల్లో ఏడాదికి రూ.72 వేల నగదు జమవనుంది. దీంతో దేశంలోని 20 శాతం పేదలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ పథకం గురించి కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ)లో చర్చించాక సోమవారం ఢిల్లీలో పథకం విధివిధానాలను రాహుల్ గాంధీ వెల్లడించారు.
నేరుగా పేదల ఖాతాలో జమ
అన్నివిధాలా ఆలోచించి, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని నిర్ణయం తీసుకున్నాని పేర్కొన్నారు. ఈ పథకంతో వచ్చే సమస్యల గురించి అధ్యయనం చేశామన్నారు రాహుల్. పేదల ఖాతాలో ఈ నగదు జమవుతోందని, మధ్యవర్తిత్వానికి తావులేదని స్పష్టంచేశారు.
5 కోట్ల కుటుంబాలు, 25 కోట్ల ప్రజలు
దీంతో 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు రాహుల్. 25 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. దీంతో దేశంలో పేదరికం పోతోందని విశ్వాసం వ్యక్తంచేశారు.
సుదీర్ఘ కసరత్తు, తర్వాతే నిర్ణయం
ఈ పథకం కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘగా కసరత్తు చేసింది. సీనియర్ నేత చిదంబరం నేతృత్వంలోని కమిటీ పథకం తీరుతెన్నులను గురించి అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. దీంతోపాటు చిదంబరం కమిటీ, కనీస ఆదాయ పథకం కోసం కూడా కృషి చేస్తుందని చెప్పారు. దీనికి సంబంధించి మేనిఫెస్టోలో పూర్తి వివరాలను అందజేస్తామని తెలిపారాయన.
ఊపశమనం కోసం పథకం
ఎన్డీఏ సర్కార్తో ప్రజలు గత ఐదేళ్ల నుంచి ఇబ్బందులు పడ్డారని, వారిని బాధల నుంచి విముక్తి చేసి న్యాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు రాహుల్.
అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రకటనలు
గత బడ్జెట్లో రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందజేస్తామని మోదీ సర్కార్ ప్రకటించింది. దీంతో పేద రైతులకు మేలు జరుగుతోందని అభిప్రాయపడింది. ఏడాదికి మూడు విడతల్లో నగదు ఇస్తామని, తెలుపగా విపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కానీ పేదల ఖాతాలో నెలకు రూ.6 వేల జమచేస్తామని వారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు రాహుల్.