మహిళా దినోత్సవం రోజు రాహుల్ వరాలు: మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తాం
ఒడిషా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు వరాలు ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గత తొమ్మిదేళ్లుగా లోక్సభలో పెండింగ్లో ఉన్న మహిలా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయిస్తామన్నారు. ఇప్పటి వరకు బిల్లు రాజ్యసభలో పాస్ అయ్యింది కానీ లోక్సభలో పెండింగ్లోనే ఉంది. ఒడిషా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ మహిళలతో సమావేశమయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన రాహుల్ గాంధీ... మహిళల పాత్ర లేకుండా దేశం పురోగతి చెందదని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, ప్రభావం ఎన్నడూ లేనంతగా ఉంటుంది: మాజీ సీఈసీ కృష్ణమూర్తి
చట్టసభల్లో మహిళలు ప్రాతినిథ్యం వహించాలి
పురుషుడికి స్త్రీ ఏమాత్రం తీసిపోదని చెప్పిన రాహుల్ గాంధీ తమ సమాన హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు చట్టసభల్లో ఉండాలని ఆకాంక్షించిన రాహుల్ గాంధీ... అసెంబ్లీ, లోక్సభల్లో మహిళా ప్రాతినిథ్యం పురుషులతో సమానంగా ఉండాలన్నారు. అంతేకాదు మహిళలు సమాజంలో సమానహక్కులు కలిగేలా పురుషులు అండగా నిలవాలని కోరారు. దేశంలో మహిళాసాధికారత కనిపించాలంటే అసెంబ్లీ, లోక్సభలో మహిళా ప్రాతినిథ్యం తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు రాహుల్. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తప్పనిసరిగా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు.
వితంతువులకు పెన్షన్ రూ.2వేలు ఇస్తాం
ఇక ఒడిషాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదమహిళల వివాహాలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ అధ్యక్షుడు..... భర్త కోల్పోయిన మహిళలకు నెలకు రూ. 2వేలు పెన్షన్ అందజేస్తామన్నారు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 108వ రాజ్యాంగ సవరణ బిల్లును 2008లో నాటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే బిల్లు రాజ్యసభలో 2010లో పాస్ అయ్యింది కానీ లోక్సభలో మాత్రం పెండింగ్లో ఉంది. అయితే 2014లో తాము అధికారంలోకి వస్తే బిల్లు పాస్ అయ్యేలా చూస్తామని బీజేపీ నాడు ఎన్నికల హామీగా ఇచ్చింది. పలు పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ లోక్సభలో మాత్రం పాస్ కావడంలేదు.
మహిళలపై అఘాయిత్యాలు జరిగితే సత్వరమే న్యాయం చేస్తాం
మహిళలు రాజకీయాల్లో ఎక్కువగా ప్రాతినిథ్యం వహించాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాయని అక్కడ మహిళ ప్రాతినిథ్యం గురించి ఉదహరించారు. మహిళలపై అఘాయిత్యాలకు ఎవరైనా పాల్పడితే వారిని క్షమించే ప్రసక్తేలేదని రాహుల్ చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడితే సత్వరమే న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం నిబంధనలను తీసుకొస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఒడిషాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు, మహిళలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. మెడిసిన్ ఇంజినీరింగ్ విద్యలను కూడా మహిళలకు ఉచితంగా అందిస్తామన్నారు. గిరిజనులు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలు చదువుకోవాలని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.