దుబాయ్ లో సత్తా చాటుకున్న రాహుల్ గాంధీ..! బీజేపి వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య..!!
దుబాయ్/ హైదరాబాద్ : ఏఐసీసీ అద్యక్షడు రాహుల్ గాంధీ దుబాయ్ లో సత్తా చాటుకున్నారు. దుబాయ్ ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి పెద్ద యెత్తున స్పందించారు. బీజేపి వల్ల దేశానికి ఒరింగేదేమీ లేదని అన్నారు. భారతదేశంలో అసహనం పెరిగిపోయిందని, అసహనం అనే రోగంతో దేశం బాధపడుతోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు.
అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, ఈరోజు మీవల్లే దుబాయ్ ఇలా ఉంది: రాహుల్ గాంధీ
సహనం ఏడాదిగా 2019ని ప్రకటించిన యూఏఈని రాహుల్ గాంధీ ప్రశంసించారు. పెద్ద నోట్ల రద్ధు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదలైందని, నిరుద్యోగం వెంటాడుతున్నదని, మనం లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగితే చైనా దేశం కన్నా ఎక్కువ ఉద్యోగాలు కల్పించవచ్చన్నారు. రాహుల్ గాంధీ సమావేవానికి ఇంత పెద్దయెత్తున జనం రావడం పట్ల ఏఐసీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పెట్టిన పెట్టుబడికి సరైన గిట్టుబాటు ధర రాక, పండిన పంటకు తగ్గ లాభం రాకపోవడంతో రైతాంగం అలవికాని సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. 2019లో అధికారంలోకి రాగానే చేసే మొదటి పని అదేనని ఆయన చెప్పారు. దుబాయ్ అభివృద్ధికి కృషి చేస్తున్న భారతీయ కార్మికులను రాహుల్ అభినందించారు. రాహుల్ వెంట సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఉన్నారు. ఆంద్ర ప్రదేశ్ ప్రస్తావనను దుబాయ్ లో తీసుకురావడం పట్ల ఇటు ఏపి కాంగ్రెస్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రాహుల్ గాంధీ మంచి విజన్ ఉన్న నేతగా ఏపి కాంగ్రెస్ అభివర్ణిస్తోంది.