బీజేపీ అధికారంలోకి వస్తే రాహుల్ బాధ్యుడే : ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలనం
న్యూఢిల్లీ : ఎన్నికల ఫలితాల సమయం సమీపిస్తోన్న వేళ నేతల ఆందోళన నెలకొంది. తిరిగి ఏ పార్టీ అధికారం చేపడుతుంది ? ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయోననే టెన్షన్ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తమ విజయంపై కాస్త అనుమానంగానే ఉన్నట్టు కనిపించారు. ఒకవేళ తిరిగి మోదీ అధికారం చేపడితే అని కామెంట్ చేయడం ఆయన ఆందోళనకు అద్దం పడుతోంది.
అంతా మీరే చేశారు ?
కేజ్రీవాల్ ప్రధానంగా విపక్ష కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. ఆ పార్టీ విపక్షంగా వ్యవహరించలేదని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయాల్సింది పోయి .. ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేక పార్టీలతో కలిసి పోటీ చేసిందని దుయ్యబట్టారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమితో అంతర్గత ఒప్పందం, కేరళలో వామపక్షాలతో కలిసి పోటీచేయడం, బెంగాల్లో టీఎంసీ, ఏపీలో టీడీపీతో, ఢిల్లీలో ఆప్తో జట్టుకట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాకుండా .. ఆయా పార్టీల పొత్తుతో బీజేపీ కలిసి వస్తే ఏంటని నిలదీశారు. ఒకవేళ కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే రాహుల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఓటుబ్యాంకు మళ్లుతుందా ?
ఎల్లుండి ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి. హస్తినలో ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయి. ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదన్నారు. ఆయా పార్టీలతో జట్టుకట్టడం వల్ల బీజేపీకి ఓటు బ్యాంకు పెరుగుతుందెమోననే అనుమానం వ్యక్తం చేశారు.
మోదీపై విమర్శలు
ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ప్రతి విభాగంలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఆయనది నిజమైన దేశభక్తి కాదని మరోసారి ఉద్ఘాటించారు. దీంతో దేశానికి ప్రమాదమేనని స్పష్టంచేశారు. ఆర్మీని కూడా ఓటేసేందుకు వాడుకున్నారని .. అంతే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబపట్టారు. యూపీఏ -2 హయం 2011 నుంచి 2013 వరకు మన్మోహన్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ కన్నా వెయ్యి రేట్ల నయమని పేర్కొన్నారు కేజ్రీవాల్.
67 గెలిచాం .. 7 గెలవమా ?
మోదీ, షా ద్వయం మళ్లీ అధికారం చేపట్టకూడదని .. ఇందుకోసం ఆప్ పనిచేస్తుందని స్పస్టంచేశారు. బీజేపీ అధికారంలోకి రాకూడదనే తాము విపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని గుర్తుచేశారు. ఢిల్లీలోని 7 సీట్లలో ఆప్ అభ్యర్థులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతనెలలో విజయం కాస్త కఠినంగా ఉండేదని .. గత 10 రోజుల నుంచి పరిస్థితి మారిందని గుర్తుచేశారు. ఢిల్లీ అసెంబ్లీలో 67 సీట్లు గెలిచామని .. ఇప్పుడు 7 సీట్లు గెలువడం పెద్ద ఆశ్చర్యమేమి అనిపించడం లేదన్నారు. మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుంది. కానీ ఆప్ మాత్రం విద్య, ఆరోగ్యం, మంచినీటి సాదుపాయం, తక్కువ కరెంట్ చార్జీలు తగ్గిస్తామని ఓట్లు అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. పైవన్నీ విషయాలను మోదీ పట్టించుకోరని విమర్శిచారు.