కుల, గోత్రాలు వెల్లడించిన రాహుల్.. బీజేపీకి సమాధానమా?
Recommended Video
పుష్కర్ : ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ టార్గెట్ గా ఇటీవల బీజేపీ శ్రేణులు చేస్తున్న వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. శివభక్తుడినంటూ రాహుల్ ఆలయాల చుట్టూ తిరుగుతున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్తిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో రాహుల్ జంధ్యం ధరించి పూజల్లో పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు ధరించిన జంధ్యమేంటి? మీ గోత్రమేంటో చెప్పగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు.
బీజేపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెబుతున్నట్లుగా తాజాగా రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కులగోత్రాలు వెల్లడించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజస్ఠాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్.. పుష్కర్ లోని బ్రహ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పూజలో భాగంగా ఆలయ పూజారి కులగోత్రాలు అడిగారు. దీంతో కౌల్ బ్రహ్మణ సామాజిక వర్గమని, దత్తాత్రేయ గోత్రమని రాహుల్ సమాధానమిచ్చారు. బ్రహ్మ ఆలయ దర్శనం తర్వాత అజ్మీర్ లోని ఖ్వాజా దర్గాకు వెళ్లారు.
బీజేపీకి సమాధానం
ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ టెంపుల్ రన్ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ ఆలయాల పర్యటన చర్చానీయాంశంగా మారింది. అంతేకాదు ఆలయాల చుట్టూ రాహుల్ తిరగడాన్ని బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఎన్నికల స్టంట్ అని ఆరోపిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయానికి వెళ్లిన రాహుల్.. సంప్రదాయ దుస్తులతో పాటు జంధ్యం, బొట్టు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి అభిషేకం చేశారు. దీంతో మీ గోత్రమేంటి.. మీరు ధరించిన జంధ్యమేంటి చెప్పగలరా అంటూ ప్రశ్నలు సంధించారు.
టెంపుల్ రిజిస్టర్ లో జైహింద్, వందేమాతరం
రాహుల్ గాంధీ టెంపుల్ రన్ పై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన తాజా ప్రకటన ఆసక్తి రేపుతోంది. బీజేపీ నేతలకు సమాధానంగా రాహుల్ కులగోత్రాలు వెల్లడించారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్కర్ లోని బ్రహ్మ ఆలయంలో పూజల సందర్భంగా కులగోత్రాలు వెల్లడించారు రాహుల్. అంతేకాదు ఆలయ రిజిస్టర్ లో జైహింద్, వందేమాతరం అని కూడా రాసినట్లు సమాచారం. అదలావుంటే గతంలో తమ కుటుంబమంతా శివభక్తులమని కూడా రాహుల్ చెప్పారు.
అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్.. మధ్యలో రాహుల్..!
రాహుల్ మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇటీవల బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లీడర్ సంజయ్ ఝా ట్విట్టర్ వేదికగా రియాక్టయ్యారు. రాహుల్ గాంధీ గోత్రం అడగటం వింతగా ఉందన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఒబామా బర్త్ సర్టిఫికెట్ అడిగినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీని చూసి జనం విసుక్కుంటున్నారని తెలిపారు. మొత్తానికి రాహుల్ హిందుత్వంపై కమలనాథులు విమర్శిస్తుంటే.. బీజేపీ తీరుపై హస్తం నేతలు మండిపడుతున్నారు. ఇలా రాహుల్ గాంధీ టెంపుల్ రన్ వివాదస్పదమైన నేపథ్యంలో ఆయన కులగోత్రాలు బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.