రాహుల్ నాయకత్వంపై ఫోతేదార్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎంఎల్ ఫోతేదార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పగ్గాలు చేపట్టడాన్ని పార్టీలో చాలామంది ఒప్పుకోవడం లేదని, ప్రధానమంత్రి అభ్యర్థిగానూ రాహుల్ సరైనవాడు కాదని అన్నారు.
త్వరలో విడుదల కానున్న తన పుస్తకం ‘ద చినార్ లీవ్స్'లో ‘‘రాహుల్ కూడా రాజీవ్, ఇందిర తర హాలోనే అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే, వారిద్దరూ ఉన్నతస్థాయికి ఎదిగినా, ఆ నాయకత్వ లక్షణాలు రాహుల్లో ఉన్నా యా? అనేది ప్రశ్నార్థకమే'' అని ఫోతేదార్ అభిప్రాయపడ్డారు.
రాహుల్ నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు అంగీకరించరని, సోనియా గాంధీ శకం కూడా దాదాపుగా ముగిసిపోయినట్లేనని ఫోతేదార్ అంటూ, పార్టీకి దిశా నిర్దేశం చేసేవారు ఎవరూ లేరని, కాంగ్రెస్ పార్టీ తన తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
‘‘రాహుల్ నాయకత్వాన్ని దేశ ప్రజలు ఒప్పుకోరు. కాంగ్రెస్ పార్టీ కొత్త విషయాలను నేర్చుకోవడం మర్చిపోయింది'' అన్నారు. ‘‘అసలు పార్టీ చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలపై స్పష్టంగా లేదు. నెహ్రూ, ఇందిరా గాంధీ వారసత్వం దిగజారుతోందని, ఇది చాలా బాధాకరం'' అని అన్నారు.
సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టి తిరిగి పూర్వ వైభవం తీసుకు వచ్చినప్పటికీ సోనియా గాంధీ పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్షురాలుగా కొనసాగిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవచ్చునేమో కానీ పార్టీని కాపాడే స్థితిలో ఆమె లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘రాబోయే సవాళ్లను వీరు ఎదుర్కోగలరా? అనే ప్రశ్న వేధిస్తోందన్నారు.
సోనియా ఏం చేయాలన్నా చాలామందిపై ఆధారపడాల్సి వస్తోందని, ఆమెకు సలహా ఇచ్చే వాళ్లలో చాలామంది అనేక విషయాల్లో ఆమె లాగానే అజ్ఞానులని ఫోతేదార్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ‘‘నా వ్యాఖ్యలతో సోనియా ఆందోళన చెందవచ్చు. కానీ, ప్రియాంక గాంధీనే తన రాజకీయ వారసురాలని ఇందిరా గాంధీ ఎప్పుడో చెప్పారు'' అని పేర్కొన్నారు.
సోనియా చుట్టూ ఉన్న వాళ్లకు వారసుడిగా రాహుల్ ఎదగడం లోలోపల ఇష్టం లేదని, ఎందుకంటే రాహుల్ నాయకుడిగా ఎదిగితే తాము ఉనికిని కోల్పోతామన్నది వాళ్ల భయమని ఆయన తన పుస్తకంలో రాశారు.