పదేళ్లుగా ఏం చేశారో!: రాహుల్పై ఊగిపోయిన హర్సిమ్రాత్
ఛండీగఢ్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన కేంద్రమంత్రి హర్సిమ్రాత్ కౌర్ బాదల్ బుధవారం ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై మోడీ సర్కారును నిలదీస్తున్న రాహుల్.. పదేళ్లుగా నోరు విప్పలేదని, ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు.
తాము చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. పదేళ్లు మాట్లాడకుంటా ఇప్పుడు మాట్లాడితే ఎవరూ విశ్వసించరన్నారు. రైతు ఆత్మహత్యల పైన బుధవారం నాడు లోకసభలో వాడిగావేడిగా చర్చ సాగింది.
ఈ సందర్ఫంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... రైతుల సమస్యలు తెలియాలంటే ప్రధాని మోడీ పంజాబ్ వెళ్లాలని చురక అంటించారు. మేకిన్ ఇండియా అంటున్న మోడీ సర్కారుకు దేశం ముందుకు వెళ్లే దిశలో రైతుల ప్రాతినిథ్యం అక్కరలేదా అని ప్రశ్నించారు. రైతులను, వారి సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రధాని మోడీ పర్యటనలతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల పంటకు మద్దతు ధర లభించడం లేదన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ పదేళ్లు ఎక్కడున్నారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాహుల్ రెండు నెలలు సెలవు తీసుకొని, ఇప్పుడు వచ్చి మాట్లాడటం విడ్డూరమన్నారు.
రాహుల్ గాంధీది అంతా పొలిటికల్ జిమ్మిక్ అని ధ్వజమెత్తారు. మరో బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. రవిశంకర ప్రసాద్ మాట్లాడుతూ.. తాను నిత్యం చెబుతుంటానని, రాహుల్ గాంధీ బాగా హార్డ్ వర్క్ చేయాలని, చట్టాలను చదవాలని అన్నారు.