అలా ఐతే 2019లో నేనే ప్రధాని: రాహుల్ గాంధీ కీలక ప్రకటన, కాంగ్రెస్ శ్రేణుల హర్షం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని పదవిపై తొలిసారి స్పందించారు.
2019లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే తానే ప్రధాని అవుతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
2019లోనే ప్రధానిని నేనే
2019లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ అవతరిస్తే ప్రధాని పదవి చేపడతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అవును అని రాహుల్ సమాధానమిచ్చారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
అవినీతి పరులెందుకు?
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి(యడ్యూరప్ప)ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారో చెప్పాలని మోడీని ప్రశ్నించారు. రూ.35వేల కోట్లు దోచుకున్న గాలి జనార్ధన్ రెడ్డి వర్గానికి 8 సీట్లు ఎందుకు ఇచ్చారని నిలదీశారు.
ఉద్యోగాలేవీ?
యువతకు ఉద్యోగ కల్పన ఎందుకు జరగడంక లేదో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని అన్నారు. 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రధాని ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని అన్నారు. ‘మొబైల్ ఫోన్లలో మూడు మోడ్స్ ఉంటాయి. వర్క్మోడ్.. స్పీకర్ మోడ్, ఎయిరోప్లేన్ మోడ్. మోడీజీ స్పీకర్ మోడ్, ఎయిరోప్లేన్ మోడ్నే వాడతారు. వర్క్మోడ్ జోలికి అస్సలు వెళ్లరు'అని రాహుల్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ శ్రేణుల హర్షం
ప్రధాని పదవిపై రాహుల్ మనసులో మాట బయటపెట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి పదవిని చేపట్టే విషయంలో యువనేత స్పష్టత ఇవ్వడంతో హస్తం పార్టీ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఆయనే అని తెలిసినప్పటికీ.. స్వయంగా రాహుల్ ఈ విషయాన్ని ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.