టంగ్ స్లిప్: ఉగ్రవాదులను రాహుల్ ఇలా సంబోధించాడు...వీడియో వైరల్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కమలం పార్టీకి టార్గెట్ అయ్యారు. జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను మసూద్ అజార్ జీ అని సంబోధించి వివాదాస్పదపాలయ్యారు. ఓ వైపు ఉగ్రవాదుల పని బీజేపీ ప్రభుత్వం పడుతుంటే మరోవైపు రాహుల్ గాంధీ ఉగ్రవాదులను 'గారు' అని గౌరవంగా సంబోధిస్తున్నారని ధ్వజమెత్తింది.
మసూద్ను 'మసూద్ అజార్ గారు' అని సంబోధించిన రాహుల్
ఇక అసలు విషయానికొస్తే... ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ అయి కాందహార్లో ఉన్నసమయంలో ప్రస్తుత జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్ మసూద్ అజార్ను కాందహార్ వరకు తీసుకెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మసూద్ అజార్ గారు అని రాహుల్ నోటి నుంచి రావడంతో బీజేపీ రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది.
పాకిస్తాన్-రాహుల్ గాంధీ ఇద్దరికీ ఉగ్రవాదులంటే ప్రేమ
పాకిస్తాన్ రాహుల్ గాంధీల మధ్య ఓ విషయం కామన్గా ఉందన్నారు బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ. పాకిస్తాన్, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఉగ్రవాదులపై అమితమైన ప్రేమ ఉందని ఆమె అన్నారు. కాంగ్రెస్లో ఉగ్రవాదులను ప్రేమించే వారిలో మరొకరు కూడా ఉన్నారని అన్నారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. ఒసామా బిన్ లాడెన్ను ఒసామా గారు అని, హఫీజ్ సయీద్ను హఫీజ్ సయీద్ సార్ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్న విషయాన్ని రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు.
ఆర్బీఐ అనుమతి లేకుండానే ప్రధాని మోడీ ఈ నిర్ణయం చేసేశారు: ఆర్టీఐ
కాంగ్రెస్ కౌంటర్ అటాక్
మసూద్ అజర్ను మసూద్ అజర్ గారు అని సంబోధించిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. అయితే రాహుల్ గాంధీ ఏదో పరధ్యానంలో అన్నట్లుగా ఉంది. మసూద్ అజార్ దేశం నుంచి పారిపోయేందుకు సహకరించింది నాటి బీజేపీ సర్కార్ అని చెబుతూ నోరుజారారు. బీజేపీ రాహుల్ వీడియోను వైరల్ చేయడంతో అందుకు కౌంటర్గా కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా కూడా మసూద్ అజార్ విడుదల సందర్భంగా ఆయన్ను తోడ్కొని వెళుతున్న ఫోటోలను ట్విటర్ వేదికగా విడుదల చేశారు.