ఒక్కమాటా లేదు.. చైనా అధ్యక్షుడికి భయపడుతున్న బలహీన మోడీ: మసూద్ అజహర్ ఇష్యూపై రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం నిప్పులు చెరిగారు. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటన చేయకుండా చైనా అడ్డుకుంది. దీనిపై ఆయన స్పందించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ముందు బలహీనుడైన ప్రధాని మోడీ మోకరిల్లుతున్నారని ట్వీట్ చేశారు.
ఇది మిత్రులుగా మార్చే చాయ్!: పాకిస్తాన్లో టీ దుకాణం ముందు అభినందన్ ఫోటోతో బ్యానర్
జీ జింగ్పింగ్ను చూసి మోడీ భయపడుతున్నారు
భద్రతా మండలిలో భారత్కు వ్యతిరేకంగా చైనా వ్యవహరించిన తర్వాత ఒక్కమాట కూడా నరేంద్ర మోడీ నోటి నుంచి రాలేదని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. గుజరాత్లో జీ జిన్పింగ్తో కలిసి చక్కెర్లు కొట్టడం, ఢిల్లీలో ఆయనను హత్తుకోవడం, చైనాలో ఆయనకు మోకరిల్లడం.. ఇదే చైనాకు సంబంధించి మోడీ దౌత్య విధానం అని విమర్శలు గుప్పించారు. జీ జింగ్పింగ్ను చూసి మోడీ భయపడుతున్నారన్నారు.
చైనా తప్ప అన్ని దేశాలు మద్దతు
కాగా, మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుపడిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత మసూద్ అజహర్పై నిషేధం విధించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన ప్రతిపాదనను టెక్నికల్ కారణాలు చూపిస్తూ చైనా మరోసారి అడ్డుకుంది. భద్రతా మండలికి చెందిన 1267 అల్ఖైదా ఆంక్షల కమిటీ పరిధిలో అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా గత నెల 27న ప్రతిపాదించాయి.
గడువుకు గంట ముందు చైనా ప్రకటన
పుల్వామాలో జైష్ ఏ మహ్మద్ సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. భద్రతా మండలికి ప్రతిపాదన వచ్చిన పది పని దినాలలో ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే అది అమల్లోకి వస్తుంది. అజహర్పై నిషేధం ప్రతిపాదనకు బుధ, గురు వారాల మధ్య రాత్రి 12.30 గంటలకు గడువు ముగియనుండగా, బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో చైనా తన నిర్ణయాన్ని తెలిపింది. అయితే మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింప చేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని భారత్ తెలిపింది. ఈ పరిణామాలతో తాము అసంతృప్తితో ఉన్నామని పేర్కొంది.