రాహుల్ గాంధీ : దేశాన్ని ఏ శక్తి విడదీయదు.. ప్రభుత్వానికి సహకరిస్తాం
ఢిల్లీ : కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. జవాన్ల మీద జరిగిన దాడిన హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలబడతామని ప్రకటించారు. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్ పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో విషాదం నెలకొన్న ఈ సమయంలో రాజకీయ వివాదాలకు తావిచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోనని చెప్పారు.
పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన రాహుల్ గాంధీ.. సైన్యానికి సంఘీభావం ప్రకటించారు. భారత్ లో అల్లకల్లోలం సృష్టించి దేశాన్ని విభజించాలనుకునే శక్తుల కుట్రలు సాగవని అన్నారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన మన్మోహన్ సింగ్.. 40 మంది జవాన్లు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో రాజీ పడబోయే ప్రసక్తి లేదన్నారు. పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.