రెండు కోట్ల ఉద్యోగాలన్నారు.. గతేడాది కోటి ఉద్యోగాలు పోయాయి: ప్రధానిపై రాహుల్ ఫైర్
జైపూర్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారత్కు ఉన్న మంచి ఇమేజ్ను ప్రధాని మోడీ డ్యామేజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ విధానాలతో భారత్కు పెట్టుబడులు రావడం లేదని మండిపడ్డారు రాహుల్ గాంధీ.
భారత్ ఇమేజ్ను మోడీ డ్యామేజ్ చేశారు
భారతదేశంలో సోదరభావం ఉట్టిపడేలా ఉంటుందని చెప్పిన రాహుల్ గాంధీ... ప్రేమ సమగ్రతకు భారత్ మారుపేరని ప్రపంచదేశాల్లో ఆ గుర్తింపు భారత్కు ఉందని అన్నారు. మరోవైపు పాకిస్తాన్కు హింసాత్మక దేశంగా పేరుగాంచిందన్నారు. ఈ రోజు భారత్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందంటే అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని రాహుల్ మండిపడ్డారు. జైపూర్లో జరిగిన యువ ఆకర్ష్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారత్ను ప్రపంచదేశాలు అత్యాచార రాజధానిగా చూస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
జీడీపీ ఆ స్థాయికి పడిపోవడం సిగ్గు చేటు
ఇక మోడీ విధానాలతో దేశం ఆర్థికంగా వెనకబడుతోందని చెప్పిన రాహుల్ గాంధీ... ఆర్థిక వృద్ధి గణనీయంగా క్షీణించిందన్నారు. మోడీ ప్రభుత్వంలోకి వచ్చాక పాత జీడీపీ లెక్కలు గమనిస్తే జీడీపీ 2.5శాతానికి పడిపోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. యూపీఏ హయాంలో వృద్ధి రేటు 9శాతంగా ఉన్నిందని గుర్తు చేసిన రాహుల్ గాంధీ... మోడీ సర్కార్ గణాంకాలను మార్చడం ద్వారా వృద్ధి రేటును నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం వృద్ధి రేటు 5శాతంకు పడిపోవడం నిజంగానే సిగ్గుచేటని అన్నారు.
2019లో కోటి మందికి ఉద్యోగాలు పోయాయి
దేశ ఆర్థిక విధానం, నిరుద్యోగం గురించి హైలైట్ చేసేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీలో రాహుల్ గాంధీ నిరుద్యోగ అంశంపై మాట్లాడారు. ప్రధాని మోడీ 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని గుర్తు చేసిన రాహుల్ గాంధీ... ఒక్క 2019లోనే కోటి మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పారు. దేశం ఏ పరిస్థితుల్లో ఉందో యువతకు తెలుసన్నారు కాంగ్రెస్ ఎంపీ. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో నైపుణ్యత ఉన్నవారు చాలా మంది ఉన్నారని వెల్లడించారు. ప్రపంచాన్ని మార్చగల సత్తా భారత యువతకు ఉందని కానీ మోడీ విధానాలతో ఆ నైపుణ్యం వెలుగులోకి రావడం లేదని అన్నారు. ఉద్యోగాల విషయమై మోడీ సర్కార్ను నిలదీయాలని యువతకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ... గొంతు విప్పి యువత గట్టిగా ప్రశ్నించాలని కోరారు.