ఆర్మీని అవమానిస్తారా? సారీ చెప్పండి: మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాహుల్, ఆర్ఎస్ఎస్ కౌంటర్
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
'మీ వ్యాఖ్యలకు సిగ్గుపడాలి' అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగం ప్రతీ భారతీయుడికీ అవమానకరంగా ఉందన్నారు.
భారత ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారిని అగౌరవపరిచేలా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ప్రతీ జవాను శాల్యూట్ చేసిన జాతీయ పతాకాన్ని అవమానించేలా వ్యఖ్యలు ఉన్నాయని చెప్పారు.
కాగా, సందర్భం వస్తే దేశం కోసం పోరాడేందుకు ఆర్మీని మూడు రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ సిద్ధం చేయగలదని మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ పై విధంగా స్పందించారు. , ఆర్ఎస్ఎస్ మూడు రోజుల్లోనే మిలటరీని సన్నద్ధం చేయగలదని, అదే ఆర్మీకి అయితే 6నుంచి7 నెలలు పడుతుందని... అదీ తమ సామర్థ్యమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
భగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారు: ఆర్ఎస్ఎస్
మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పేర్కొంది. దేశానికి సైన్యం అవసరమైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మూడు రోజుల్లో శిక్షణ ఇచ్చి దేశ రక్షణ కోసం సరిహద్దుకు పంపగలమని భగవత్ అన్నారని స్పష్టం చేసింది. బీహార్లో శనివారం జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.