రాహుల్ దళిత మహిళను పెళ్లి చేసుకోవాలి.. కులాంతర వివాహానికి రూ.2.50లక్షలు ఇస్తాం : కేంద్రమంత్రి
ఇటీవల లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'హమ్ దో,హమారే దో సర్కార్(మేమిద్దరం.. మాకిద్దరు..)' అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై తాజాగా కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే స్పందించారు. రాహుల్ గాంధీ ఆ నినాదాన్ని ప్రమోట్ చేయాలనుకుంటే వివాహం చేసుకోవాలని సూచించారు. అంతేకాదు, దళిత మహిళను వివాహం చేసుకోవడం ద్వారా కులనిర్మూలన దిశగా అడుగు వేయాలన్నారు.అథవాలే వ్యాఖ్యలు రాహుల్పై వ్యంగ్యాస్త్రాలా లేక ఏ ఉద్దేశంతో అన్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
రామ్దాస్ అథవాలే కామెంట్స్...
'నాకు మంచి మిత్రుడిగా భావించే రాహుల్ గాంధీ 'హమ్ దో,హమారే దో..' అని మాట్లాడుతున్నారు. ఈ నినాదం కుటుంబ నియంత్రణకు సంబంధించినది. ఒకవేళ రాహుల్ గాంధీ 'హమ్ దో,హమారో దో' నినాదాన్ని ప్రమోట్ చేయాలనుకుంటే... ఆయన తప్పక వివాహం చేసుకోవాలి. ఆయన తప్పక ఒక దళిత మహిళను వివాహం చేసుకోవాలి. తద్వారా మహాత్మాగాంధీ కలలు గన్న కుల నిర్మూలన ఆకాంక్షను నెరవేర్చాలి. దేశ యువతలో ఇది స్పూర్తిని నింపుతుంది.' అని అథవాలే వ్యాఖ్యానించారు. అంతేకాదు,రాహుల్ గాంధీ కులాంతర వివాహం చేసుకుంటే తన మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతున్న పథకం కింద రూ.2.5లక్షలు ఆయనకు అందజేస్తామని పేర్కొన్నారు.
రాహుల్ స్లోగన్...
ఇటీవల లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. 'హమ్ దో హమారే దో సర్కార్..(మేమిద్దరం... మాకిద్దరు..)' అంటూ కేంద్ర ప్రభుత్వాన్నిటార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఆయన ఎవరి పేర్లు పేర్కొననప్పటికీ.. ఆ ఇద్దరు బడా కార్పోరేట్స్ అంబానీ,ఆదానీ అంటూ కాంగ్రెస్ సభ్యులు సభలో గట్టిగా అరిచారు. ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్రమంత్రి అమిత్ షా... కార్పోరేట్స్ అంబానీ,ఆదానీలను ఉద్దేశించి రాహుల్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మండీ వ్యవస్థను నాశనం చేసి కొంతమంది కార్పోరేట్లకు మేలు చేసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సామాన్య జనాలను దోచుకుంటూ ఆ ఇద్దరి అభివృద్దికి సహకరిస్తోందని రాహుల్ విమర్శించారు.
గతంలో గో కరోనా స్లోగన్...
రామ్దాస్ అథవాలే గతంలోనూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గతేడాది ఆయన ఇచ్చిన 'గో కరోనా గో...' నినాదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇటీవలే ఆయన మరో కొత్త నినాదం కూడా ఇచ్చారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ' నో కరోనా నో..' అనే నినాదాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. ఇలా నినాదాలతో పాపులర్ అవుతున్న అథవాలే... రాహుల్ గాంధీ 'హమ్ దో హమార్ దో సర్కార్..' నినాదంపై తనదైన శైలిలో స్పందించి మళ్లీ వార్తల్లో నిలిచారు.