భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటున్నా.. స్పందించరా?: మోడీపై రాహుల్ ఫైర్
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నా.. 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తి ఆ దేశం పేరును కూడా చెప్పలేకపోతున్నారని నరేంద్ర మోడీని ఉద్దేశించి రాహుల్ విమర్శించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మూడు రోజులపాటు ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తిరుపూరు, కోయంబత్తూరులో ఆయన ప్రచారం నిర్వహించారు. తొలిసారి చైనా మనదేశ భూభాగాలను ఆక్రమించుకుంటోందని రాహుల్ ఆరోపించారు. సరిహద్దులో ఏం జరుగుతుందో మోడీ పట్టించుకోవడం లేదన్నారు.
మోడీ సర్కారు పేదల కోసం పనిచేయడం లేదని, వ్యాపారుల కోసం పనిచేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమిళ సంస్కృతిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ఒకే సంస్కృతి, ఒకే భాష ఉండాలని భావిస్తున్నారని, ఆయనకు ఇతర సంస్కృతులు, భాషలపై ఎటువంటి గౌరవం లేదని ఆరోపించారు.
తమిళనాడులో ఉన్న ప్రత్యేక సంస్కృతిని బీజేపీ బారి నుంచి కాంగ్రెస్ కాపాడుతుందన్నారు. తమిళ భాషపై తనకెంతో గౌరవముందని రాహుల్ వ్యాఖ్యానించారు. త్వరలో తాను తమిళ్ నేర్చుకుంటానని తెలిపారు. మన్ కీ బాత్లో ప్రధానే మాట్లాడతారని, ఆయన మాట్లాడటం కాదు ప్రజలు సమస్యలు వినాలని రాహుల్ అన్నారు.
మరికొద్ది నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పట్నుంచే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అధికార, అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేతోపాటు బీజేపీ కూడా ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తోంది. కమల్ హాసన్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. తమిళ సూపర్ స్టార్ ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.