మోడీజీ నిర్మలా సీతారామన్ను తొలగించండి: ఇక సమస్య పరిష్కారమంటూ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఉపయోగించుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను తొలగించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. ప్రధాని మోడీనే ఆర్థిక మందగమనానికి కారణమని ఆయన ఆరోపించారు.
'డియర్ పీఎం.. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. దీనికి సంబంధించిన నిందలు పడకుండా ఉండాలనేదానిపై దృష్టి సారించండి. అవగాహనలేని నిర్మలాజీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను మీరు ఉపయోగించుకోండి. ఆమెను తొలగించి.. నిందలన్నీ ఆమె మీదకు తోసేయండి. సమస్య పరిష్కారమవుతుంది' అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
అయితే, దేశ ఆర్థిక మందగమనానికి ప్రధాని నరేంద్ర మోడీ అవలంభిస్తున్న విధానాలే కారణమని మరోసారి రాహుల్ గాంధీ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వంటి కారణాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని అన్నారు.
Dear PM,
— Rahul Gandhi (@RahulGandhi) February 5, 2020
The economy has imploded & you must be racking your brains on how to avoid the blame.
Use the useless budget presented by clueless Nirmala Ji. Sack her & dump the entire blame on her.
Problem solved.
ఇటీవల, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పైనా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎటువంటి వ్యూహాత్మక ఆలోచన, ముందు చూపు లేకుండా ప్రవేశపెట్టిన బడ్జెట్ అని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య ఊసేలేదని ధ్వజమెత్తారు.