ఒక కాలు ఉత్తరాదిన, మరో కాలు దక్షిణాదిన: రెండు స్థానాల్లో రాహుల్ పోటీ, కేరళ నుంచి లోక్ సభకు!
తిరువనంతపురం: ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన పార్టీ అధ్యక్షులు గానీ, రాజకీయ నాయకులు గానీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తుంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. ఓ స్థానంలో ఓడిపోయినా.. మరొకటి సేఫ్ గా ఉంటుందనేది వారి ఉద్దేశం. గతంలో ఇందిరాగాంధీ అదే పని చేశారు. అప్పుడెప్పుడో ఇందిరా గాంధీ హయాం నుంచీ రాహుల్ గాంధీ వరకూ రాజకీయాల్లో అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. గతంలో ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్: సొంత పార్టీ నేతలే కారణమంటూ ముందే హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
రెండు స్థానాల్లో పోటీ.. సర్వ సాధారణం!
2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాశి సహా, తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని వడోదర స్థానాల నుంచి ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు. అనంతరం వడోదర నియోజకవర్గానికి మోడీ రాజీనామా చేశారు. గతంలో ఎన్టీ రామారావు కూడా అనంతపురం జిల్లాలోని హిందూపురం, మహబూబ్ నగర్ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. హిందూపురంలో నెగ్గినా.. కల్వకుర్తిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు స్థానాల్లో పోటీ చేసి, ఓ చోట దారుణంగా ఓడిపోయారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం రెండు చోట్ల పోటీ చేయడానికి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.
అదే దారిలో రాహుల్..
ప్రస్తుతం రాహుల్ గాంధీ కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీ నుంచి ప్రతీసారి గెలుస్తూ వస్తోన్న ఆయన.. ఈ సారి మరో నియోజకవర్గం నుంచి కూడా లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రెండో స్థానం.. వాయనాడు. కేరళలో ఉంటుందీ నియోజకవర్గం. వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు, రక్షణశాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ ప్రకటించారు.
సిట్టింగ్ ఎంపీ కన్నుమూత
ప్రస్తుతం వాయనాడ్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం ఐ షానవాజ్ ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 20 వేలకు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందారు. గత ఏడాది నవంబర్ లో షానవాజ్ కన్నుమూశారు. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంటోంది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ లోక్ సభకు పోటీ చేస్తారని ఆంటోనీ వెల్లడించారు.
కొత్తగా పుట్టుకొచ్చిన నియోజకవర్గం..
వాయనాడ్ లోక్ సభ స్థానానికి పెద్దగా చరిత్ర ఏమీ లేదు. 2014లోనే ఈ స్థానం ఆవిర్భవించింది. వాయనాడ్ జిల్లా కేంద్రం. ఈ జిల్లాలో గిరిజనుల సంఖ్య ఎక్కువ. తేయాకు తోటలూ ఎక్కువే. ముస్లిం ఓటు బ్యాంకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందీ నియోజకవర్గం పరిధిలో. పొరుగునే ఉన్న కోజికోడ్, మళప్పురం సహా వాయనాడ్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి.
కేరళలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాదులు
కేరళలో కాంగ్రెస్ పార్టీకి మంచి పునాదులే ఉన్నాయి. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఏర్పాటైన కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. సీపీఎం నేతృత్వంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటమి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి. కేరళలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఓటమి చవి చూసింది. ఎల్ డీఎఫ్ అధికారాన్ని అందుకుంది. అంతకుముందు- పదేళ్ల పాటు యూడీఎఫ్ కేరళలో అధికారంలో కొనసాగింది. ఈ పదేళ్లూ ఊమెన్ చాందీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
సోనియాగాంధీ కూడా రెండు చోట్ల పోటీ..
ఇదివరకు రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ కూడా రెండు చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ లో సంప్రదాయబద్ధంగా వస్తోన్న రాయ్ బరేలీతో పాటు కర్ణాటకలోని బళ్లారి నియోజకవర్గం నుంచి కూడా గతంలో సోనియా పోటీ చేశారు. రెండు చోట్లా ఘన విజయం సాధించారు. అనంతరం ఆమె బళ్లారి స్థానానికి రాజీనామా చేసి, రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగించాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైనా అనుకూల స్థానాన్ని అన్వేషించాలని వర్కింగ్ కమిటీ నిర్దేశించింది. దీనితో తొలుత బీదర్ సహా కొన్ని సీట్లను ఎంపిక చేశారు. వాటిని వడపోసిన అనంతరం వాయనాడ్ ను ఎంచుకున్నారు.