మీడియా ఆగమాగం.. విద్వేష ప్రచారం.. వాస్తవాలేంటో ప్రజలకు తెలిపేందుకు రాహుల్ కొత్త ప్రయోగం..
విషయం ఏదైనా కానివ్వండి.. విద్వేషాలు రెచ్చగొట్టడం.. అన్నీ అబద్ధాలే ప్రసారం చేయడం.. ప్రజలను తప్పు దోవ పట్టించడం.. వెరసి సమాజాన్ని ఇంకాస్త భ్రష్టుపట్టిస్తోందంటూ మీడియాపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. గడిచిన ఆరేళ్లలో ఈ అపవాదు మరింతగా బలపడిందంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మీడియా పూర్తిగా ఫాసిస్టుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అసలు నిజాలేంటో ప్రజలకు తెలియకుండా పోతోందని ఆయన వాపోయారు. అందుకే ఇకపై తానే వీడియోల రూపంలో వాస్తవాలు చెబుతానని అంటున్నారు.
''ఇవాళ ఇండియన్ మీడియాలో మెజార్టీ భాగం ఫాసిస్టుల ప్రయోజనాల కోసమే పని చేస్తోంది. టీవీ చానెళ్లలో, వాట్సాప్ మెసేజ్ లలో తప్పుడు సమాచారాన్ని, విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారు. ఇలా అబద్దాలను ప్రసారం చేయడం ద్వారా దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవహారాలు, వర్తమాన చరిత్ర, సంక్షోభాలపై స్పష్టంగా, అసలు సత్యాలను తెల్సుకోవాలనుకునేవాళ్ల కోసం నేను నేను నా ఆలోచనలను మీతో వీడియోలో పంచుకుంటాను'' అని రాహుల్ గాంధీ తెలిపారు.
కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం నుంచి సరికొత్త ప్రయోగాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటిదాకా వార్తల్లోని వాస్తవాల విశ్లేషణలు వివిధ స్థాయి నేతలు, నిపుణులు చేస్తూ రాగా, తొలిసారి పెద్ద స్టేచర్ కలిగిన నేత ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తనను ఎంతగా పరిహసించినా, ప్రజా సమస్యలపై రాహుల్ అనునిత్యం మోదీ సర్కారును ప్రశ్నిస్తూ రావడం తెలిసిందే. ప్రధానంగా కరోనా విలయంపై ఫిబ్రవరిలోనే ఆయన హెచ్చరించడం, వాటిని ప్రభుత్వం లెక్కపెట్టడకపోవడం, ప్రస్తుతం కరోనా బాధిత దేశాల జాబితాలో భారత్ టాప్ 3కి ఎగబాకడం, నెలలపాటు లాక్ డౌన్ వల్ల కోట్లాదిమంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం తెలిసిందే. కరోనా విలయం, లాక్ డౌన్ అంశాలపై నిపుణులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించిన రాహుల్.. ఇప్పుడు మీడియా విద్వేష విధానాలకు వ్యతిరేకంగా వీడియోలు రూపొందిస్తానని చెప్పడం గమనార్హం.