sankranti: పొలిటికల్ పొంగల్ -తమిళనాడులో జల్లికట్టు వీక్షించనున్న రాహుల్ -పండుగనాడే చెన్నైకి అమిత్ షా
ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమిళనాట ఈ ఏడాది సంక్రాంతి పండుగ కాస్తా పొలిటికల్ పొంగల్ లా మారింది. పొంగల్ సందర్భంగా ఈసారి తమిళనాడుకు జాతీయ నేతలు క్యూకట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పండుగను అక్కడే జరుపుకోనున్నారు..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 14న తమిళనాడుకు రానున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఆనవాయితీగా నిర్వహించే జల్లికట్టు క్రీడను తిలకించేందుకు ఆయన హాజరవుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ అళగిరి మీడియాకు తెలిపారు. మధురై జిల్లా అవానిపురంలో జల్లు కట్టు క్రీడను తిలకించి, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశ రైతులకు మద్దుతుగా రాహుల్ గాంధీ ఆందోళనలో పాల్గొనున్నట్లు వెల్లడించారు.
బైక్ వెనుక కూర్చొని కసితీరా ఖతం చేసింది -మోసం చేసిన ప్రియుడిపై యువతి ఆక్రోషం -పశ్చిమగోదావరిలో
ఎద్దు రైతులకు చిహ్నమని అళగిరి పేర్కొన్నారు. కేంద్ర తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి, ఏఐఏడీఎంకే కార్యకర్తలు మినహా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేదని ఆయన అన్నారు. కాగా ఎన్నికల ముందు రాహుల్గాంధీ తమిళనాడులో పర్యటించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు..
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కూడా ఈనెల 14వ తేదీన చెన్నైకి రానున్నారు. కొత్త పార్టీ యోచన విరమించుకున్న రజనీకాంత్ ను ప్రత్యేకంగా కలిసి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతివ్వాలని షా కోరుతారని తెలుస్తోంది. కేంద్ర మంత్రి చెన్నై పర్యటనలోనే ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తుపై, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తుందని, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపైనా ఓ స్పష్టత వస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా అన్నాడీఎంకేతో బీజేపీ జరిపే తదుపరి చర్చలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.