రాహుల్ గాంధీ అంత పనిచేశాడా...కేజ్రీవాల్ ఎందుకు నిప్పులు చెరిగారు..?
ఢిల్లీ: దేశంలో ఎలాగైనా సరే మోడీ షా ద్వయంకు బ్రేక్ వేయాలి. అంటే ఏమి చేయాలి... ఒక్కటే మార్గం. విపక్షాలు అన్ని ఒక తాటిపైకి రావాలి. అందరూ కలిసి పోటీ చేయాలి. ఇందుకోసం తమలో ఉన్న విబేధాలను పక్కకు బెట్టి కలసిపోవాలి. బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇదే మంత్రను ఫాలో అవ్వాలని చాలా పార్టీలు భావించాయి. ఈ క్రమంలోనే తెరపైకి మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్ పేర్లతో కూటములు వచ్చాయి. ఇక బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా చేతులు కలపాలని భావించాయి. కానీ ఈ రెండు పార్టీ మధ్య చర్చలు ముగిసిన తర్వాత చివరి నిమిషంలో జతకట్టడం లేదని రెండు పార్టీలు ప్రకటించాయి. ఇంతకీ ఈ రెండు పార్టీ మధ్య ఎక్కడ చెడింది... అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పారు... కాంగ్రెస్ ఎలా స్పందించింది..?
విపక్షాలను బలహీనం చేయాలని రాహుల్ ప్రయత్నం
దేశంలో మోడీ మానియా తగ్గిందని విపక్షాలు చెబుతున్పప్పటికీ ... వాస్తవ పరిస్థితుల్లో అలా కనిపించడం లేదనేది విశ్లేషకుల వాదన. బలమైన మోడీ షా నాయకత్వాన్ని ఢీకొట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్లు ముందుగా కలిసి పలు రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ కొన్ని సమీకరణాలతో ఇద్దరి మధ్య పొత్తు పొడవలేదు. ఇందకు ఇరు పార్టీల వారు వారి వారి కారణాలు చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పద్దతిపై అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ బెంగాల్లో మమతా బెనర్జీని, ఉత్తర్ ప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ పొత్తును, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడును కేరళలో కమ్యూనిస్టులను బలహీన పర్చే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్షాలను బలహీన పరిచే కార్యక్రమం రాహుల్ గాంధీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ట్విటర్పై పొత్తులు జరగవు.. చర్చల ద్వారానే ఏర్పడుతాయి
ఢిల్లీ, పంజాబ్ హర్యానా గోవాల్లో కాంగ్రెస్ ఆప్ పార్టీలు పొత్తుతో వెళతాయని అంతా భావించినప్పటికీ పొత్తు ఎందుకు విఫలమైందో వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు రాహుల్ గాంధీ కేవలం నటించారని లోపల మాత్రం ఆయన ఆలోచన వేరుగా ఉన్నిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ కోసం సీట్లను త్యాగం చేస్తున్నట్లు లోగడ చేసిన ట్వీట్లు కూడా ఈ నాటకంలో భాగమే అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాజకీయ పొత్తులు ట్విటర్ వేదికగా ఏర్పాటు కావని చరిత్రలో ఇంతకు ముందెన్నడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. కేవలం చర్చల ద్వారానే పొత్తులు పొడుస్తాయి కానీ ట్విటర్ వేదికగా కాదని ఎద్దేవా చేశారు కేజ్రీవాల్.
మా పోరాటమే కాంగ్రెస్ అవినీతి పైన...
కాంగ్రెస్తో ఎప్పటికీ ఆప్ కలవకూడదని భావించిందని ఎందుకంటే కాంగ్రెస్ అవినీతిపైనే పోరాటం చేసిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని గుర్తు చేశారు కేజ్రీవాల్. కాని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్తో పంజాబ్ , హర్యానా, ఢిల్లీ, గోవాల్లో కలిపి 33 సీట్ల మేరా పొత్తు పెట్టుకోవాలని భావించినట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే పంజాబ్లో పొత్తు వద్దని కాంగ్రెస్ తెలిపింది. ఇందుకు అంగీకారం తెలిపామన్న కేజ్రీవాల్... గోవాలో కూడా వద్దన్నారు... అందుకు కూడా అంగీకరించామన్నారు. ఇక మిగతా 18 సీట్ల కోసం పొత్తుపై చర్చలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇక సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ఎత్తడం మానివేశారని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ పొత్తులు పెట్టుకోవడం లేదని కాంగ్రెస్ చెప్పారని దీంతో తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు కేజ్రీవాల్.