ఒక్కరోజు రిక్షా తొక్కాలని ఉందన్న రాహుల్ గాంధీ
లక్నో: రిక్షా కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు తాను ఒకరోజు రిక్షా కార్మికుడిగా పని చేయాలని ఆలోచిస్తున్నానని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. రిక్షా కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు ఇది ఏమాత్రం సరిపోదని, వారి జీవితాలు బాగు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను కాంగ్రెసు పార్టీ తీసుకుంటుందని చెప్పారు.
రాహుల్ గాంధీ శనివారం ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఆటో, రిక్షా కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... 'మీ సమస్యలు తెలుసుకోవడానికి ఒక రోజు రిక్షా కార్మికునిగా ఉండాలనుకుంటున్నా. ఒక్కరోజుతోనే మీ సమస్యలన్నీ తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. మీ జీవనాభివృద్ధి కోసం కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుంది' అన్నారు.
కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో సుమారు గంటన్నర పాటు రిక్షా కార్మికులతో గడిపిన రాహుల్.. రోజువారీ సంపాదన కోల్పోయి వచ్చినందుకు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రిక్షా కార్మికులు తమ సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు.
మీరు గౌరవప్రదంగా జీవించడానికి సాధ్యమైనన్నీ చర్యలు తీసుకుంటామని రాహుల్ వారికి హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు యూపీలో పేదలకు చేరడం లేదని విమర్శించారు. అంతకుముందు రాహుల్ గాంధీ కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకున్నారు.