జలియన్వాలాబాగ్ ఊచకోతకు 100ఏళ్లు పూర్తి: నివాళులు అర్పించిన ప్రముఖులు
Recommended Video
అమృత్సర్: దేశస్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య ఘట్టంగా నిలిచింది జలియన్వాలాబాగ్ ఊచకోత. 1919 ఏప్రిల్ 13న జరిగిన ఈ ఊచకోతలో చాలామంది భారతీయులు మృతిచెందారు. ఆ గాయం జరిగి నేటితో 100 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖలు నాటి చేదు జ్ఞాపకాన్ని తలుచుకుని ప్రాణాలు త్యాగం చేసిన వారికి నివాళులు అర్పించారు.
గెలుపు మూడ్లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్లో ఏం జరిగింది...?
జలియన్ వాలాబాగ్ మెమోరియల్ను సందర్శించి నివాళులు అర్పించిన రాహుల్
జలియన్వాలాబాగ్ ఊచకోత జరిగి ఏప్రిల్ 13తో వందేళ్లు పూర్తయ్యాయి. దేశానికి స్వాతంత్య్రోద్యమంలో భాగంగా జరిగిన ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం గుర్తుకు చేసుకుంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్ మెమోరియల్ను సందర్శించారు.మెమోరియల్ను సందర్శించి నాటి ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు.జలియన్వాలా బాగ్ ఘటనలో మృతులకు నివాళులు అర్పించిన తర్వాత రాహుల్ గాంధీ అక్కడే ఉన్న సందర్శకుల పుస్తకంలో వాక్యం రాశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వారిని ఎప్పటికీ మరవకూడదని రాశారు. దేశం కోసం సర్వం త్యాగం చేసినవారికి సెల్యూట్ చేస్తున్నా జైహింద్ అంటూ సందర్శకులు పుస్తకంలో రాహుల్ గాంధీ రాశారు.
రాష్ట్రపతి, మోడీ నివాళులు
శనివారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోడీలు నాటి జలియన్వాలా బాగ్ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. నాడు జలియన్వాలా బాగ్లో ప్రాణత్యాగం చేసిన వారిని భారత్ ఎప్పుడూ మరువబోదని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. వారు భారత్కోసం కన్న కలలను అన్నిటినీ సాకారం చేస్తామని చెప్పారు. వారి త్యాగం వృథాపోదని మోడీ ట్వీట్ చేశారు.
కల్నల్ డయ్యర్ క్రూరత్వం
1919 ఏప్రిల్ 13న శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతున్న భారతీయులపై కల్నల్ డైయర్ నేతృత్వంలోని బ్రిటీష్ ఇండియా ఆర్మీ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. అదేసమయంలో పంజాబ్లో ప్రముఖ పండుగ బైసాకి జరుగుతుండటంతో అమృత్సర్లో చాలామంది భక్తులు కూడా గుమికూడారు. వీరందరిపై కాల్పులు జరిపారు. జాతీయ నాయకులైన సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను అరెస్టు చేయడంతో వారిని విడుదల చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పెద్ద సంఖ్యలో భారతీయులు గుమికూడారు. అదే సమయంలో జనరల్ డయ్యర్ తన మనుషులతో వచ్చి వారిపై కాల్పులకు ఆదేశించారు. ఈ ఘటనలో 379 మంది మృతి చెందినట్లు బ్రిటీష్ ప్రభుత్వం రికార్డుల్లో ఉంది. 1200 మంది గాయపడినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి 1000కి పైగా మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగి 100 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ యూకే మాత్రం ఇప్పటి వరకు క్షమాపణ చెప్పకపోవడం విశేషం.అయితే బ్రిటన్ ప్రధాని థెరిసా మే మాత్రం 1919 జలియన్వాలాబాగ్ హత్యాకాండ బ్రిటీష్ ఇండియా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని ఈ మధ్యే వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అమృత్సర్లో జలియన్వాలాబాగ్ మెమోరియల్ను భారత్లో బ్రిటీష్ హైకమిషనర్ సర్ డామ్నిక్ అస్కిత్ సందర్శించి నాడు ఈ ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు.