గౌహతి కోర్టుకు రాహుల్: మరోసారి ఆర్ఎస్ఎస్పై ఫైర్
గౌహతి: సైద్ధాంతికంగా తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీ బుధవారం ఉదయం గౌహతి కోర్టులో హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు.ఆర్ఎస్ఎస్ను తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటానని మరోసారి తేల్చి చెప్పారు. పేద ప్రజలు, బడుగు వర్గాల అభ్యున్నతికి తాను పాటు పడుతున్నందునే ఇలాంటి కేసులు పెడుతున్నారన్నారు.
కేసులతో భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గోరక్షణ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాగా, రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవడంతో అక్కడికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు.
కాగా, రాహుల్ గతేడాది డిసెంబర్ 12న అసోం పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ప్రణాళిక ప్రకారం.. రాహుల్ 16వ శతాబ్దం నాటి బార్పెటా ఆశ్రమానికి వెళ్లి అనంతరం రోడ్షోలో పాల్గొనాలి. అయితే రాహుల్ రోడ్ షో నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం ఈ ఘటనపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఆశ్రమానికి రాకుండా కొందరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తనను అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. దీంతో ఆశ్రమం, ఆర్ఎస్ఎస్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త పరువునష్టం కేసు వేశారు.
మహాత్మాగాంధీని చంపింది ఆర్ఎస్ఎస్సే అంటూ గతంలో ఆయన ఆరోపించగా.. ఓ ఆర్ఎస్ఎస్ వాలంటీర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో మహారాష్ట్ర కోర్టులో రాహుల్పై కేసు కొనసాగుతోంది.