తోక జాడిస్తే కఠిన చర్యలు.. పార్టీ నేతలకు రాహుల్ గాంధీ హెచ్చరిక
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు రోజుల కిందటే మంత్రివర్గ విస్తరణ జరిగిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు అలర్ట్ అయ్యారు. పదవులు దక్కని అసంతృప్తులు తోక జాడిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రంగంలోకి దిగి పరిస్థితి సమీక్షిస్తున్నారు. తిరుగుబాటు నేతలపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, తిరుగుబాటు చర్యలకు ఉపక్రమించినా.. కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు.
అటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను క్షుణ్ణంగా గమనిస్తున్న బీజేపీ ఓ అడుగు ముందుకేసింది. కాంగ్రెస్ అసంతృప్తులకు తమ పార్టీలో చోటు ఉంటుందన్నట్లుగా పేర్కొంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ లీడర్లు గోడ దూకకుండా పకడ్బందీ చర్యలకు సిద్ధమయ్యారు రాహుల్.
మంత్రి పదవుల పంపకం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికారు. అందులో ఒకరైన జర్కిహోళి ప్రతిపక్ష నేతలతో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. దానికితోడు మంత్రివర్గ సమావేశాలకు రావడం లేదనే కారణాలు కూడా ఉన్నాయి. దీంతో మంత్రి పదవి ఊడిపోయిన జర్కిహెళి కాంగ్రెస్ పార్టీ పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మంత్రి పదవి ఇవ్వడం లేదని గుర్రుగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుకున్నట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి రావడం చర్చానీయాంశంగా మారింది. వారిద్దరు పార్టీకి రాజీనామా చేస్తారనేది ఆ ఆడియో తాలూకు సారాంశం. దీంతో రాహుల్ గాంధీ కర్ణాటక కాంగ్రెస్ నేతలకు అల్టిమేటం జారీచేశారు.