ఎన్నికల సమరానికి బీజేపీ.. బ్యాంకాక్ ట్రిప్ కు రాహుల్: ప్రచార బాధ్యతల నుంచి తప్పించారా?
న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ.. భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకులు ప్రచార కార్యక్రమాలు, వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలై ఉండగా.. కాంగ్రెస్ అధిష్ఠానం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ బ్యాంకాక్ ట్రిప్ వెళ్లారు. శనివారం రాత్రి ఆయన న్యూఢిల్లీ నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో బ్యాంకాక్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తరువాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ముంగిట్లో రాహుల్ గాంధీ హఠాత్తుగా బ్యాంకాక్ ట్రిప్ కు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతల నుంచి ఆయనను తప్పించారని, అందుకే ఆయన ఉన్నట్టుండి బ్యాంకాక్ వెళ్లారనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై ట్రిప్ పై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఇదివరకే నిర్ధారించిన షెడ్యూల్ అయినందున రాహుల్ గాంధీ బ్యాంకాక్ వెళ్తున్నారని వెల్లడించింది. రాహుల్ గాంధీ నాలుగైదు రోజుల్లో స్వదేశానికి తిరిగి వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన ఆయన హర్యానాలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. హర్యానా తరువాత మహారాష్ట్రలో రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు.
The personal should not be mixed with the public life of an individual. We need to entitle everybody an eternal sense of liberty and privacy. After all, this is the basic and outlining principle of a progressive and liberal democracy. #RahulGandhi #Bangkok
— Abhishek Singhvi (@DrAMSinghvi) October 6, 2019
ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు రాహుల్ గాంధీ సారథ్యం వహిస్తారని, ఇందులో ఎలాంటి అనుమానాలకు అవకాశమే లేదని చెప్పారు. వ్యక్తిగత కారణాలు, పర్యాటనలను రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అభిషేక్ మనుసింఘ్వీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ఓ ట్వీట్ ను సంధించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ సైతం దీన్ని సమర్థించారు. ఇదిలావుండగా- హర్యానా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వర్.. రాజీనామా చేయడం కలకలానికి దారి తీసింది. ఎన్నికల్లో ఓటమిని ఊహించడం వల్లే ఆయన పార్టీకి రాజీనామా చేశారంటూ బీజేపీ నాయకులు దాడికి దిగారు.
హర్యానా, మహారాష్ట్రల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం దీనికి ధీటుగా కసరత్తు చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో తాము కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 24వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు.