మమతా బెనర్జీ ఫోన్ చేసినా కోల్కతా ర్యాలీకి కేసీఆర్ నో, ఎందుకంటే: రాహుల్ గాంధీ లేఖ
హైదరాబాద్/కోల్కతా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. కోల్కతాలో బీజేపీయేతర పార్టీలు, విపక్షాల ఆధ్వర్యంలో తలపెట్టిన శనివారం నాటి ర్యాలీపై వారి మధ్య చర్చ జరిగింది.
ఈ ర్యాలీకి యునైటెడ్ ఇండియా అని నామకరణం చేశారు. ఈ ర్యాలీకి మమత.. కేసీఆర్ను ఆహ్వానించారు. ఇందుకోసం ఆమె ఫోన్ చేశారు. అయితే కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ఈ ర్యాలీకి దూరంగా ఉండనున్నారు.
ర్యాలీకి కేసీఆర్ దూరం
ఈ ర్యాలీలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కూడా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ ర్యాలీకి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాల్గొనే ఈ ర్యాలీకి నో చెప్పారు.
మమతా బెనర్జీకి రాహుల్ గాంధీ లేఖ
ఈ ర్యాలీ పైన మమతా బెనర్జీకి రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు. ర్యాలీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశంలోని కోట్లాదిమంది ప్రజల ఆగ్రహావేశాల కారణంగానే విపక్షాలు ఏకమవుతున్నాయన్నారు. ఈ ప్రజలంతా నరేంద్ర మోడీ ప్రభుత్వపు బూటకపు హామీలు, అబద్ధాలతో మోసపోయారన్నారు. మహిళలు, చిన్నారులు, కులం, మతం, భాష అన్న తేడా లేకుండా అందరి మాటకు గౌరవం ఇచ్చే రేపటి భారతం కోసం విపక్షాలన్నీ ఏకమవుతున్నాయన్నారు.
'4ఏళ్ల రంకు రాజకీయం బయటపడింది, ఆంధ్రోళ్లను కేసీఆర్ ఎన్ని మాటలన్నారు'
కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్
హక్కులు, భావజాలాల పరిరక్షణలో బెంగాలీలు ఎప్పుడూ ముందుంటారన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావడం ద్వారా బలమైన సందేశాన్ని పంపినట్లు అవుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా, మమతా బెనర్జీకి రాహుల్ గాంధీ పంపించిన లేఖను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.