దేశం మీకు ఎంతో రుణపడి ఉంది: హాల్ ఉద్యోగస్తులతో రాహుల్ గాంధీ
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అంశాల్లో ఒకటి రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలు ఒప్పందం. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా ఇందులో అవినీతి చోటుచేసుకుందంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉద్యోగస్తులతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడిన రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై ఒంటికాలుపై లేచారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్కు దేశం ఎంతో రుణపడి ఉందన్నారు. హాల్కు చెందాల్సిన ఫ్రెంచ్ ఫైటర్ ప్లేన్ రాఫెల్ విమాన ఒప్పందం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ చేతుల్లోకి ప్రభుత్వం పెట్టిందని ఘాటుగా విమర్శించారు.
భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న హాల్ ఉద్యోగుల శ్రమను వృథా పోనివ్వనని రాహుల్ హామీ ఇచ్చారు. హాల్కు రావాల్సిన ఒప్పందం అనిల్ అంబానీ లాక్కెళ్లిపోయారని ధ్వజమెత్తారు. "నేను ఇక్కడికి వచ్చింది మీ సమస్యలు వినేందుకు. మిమ్మలను అర్థం చేసుకునేందుకు వచ్చాను. మన దేశ రక్షణ వ్యవస్థను హాల్ ద్వారా మరింత బలోపేతం ఎలా చేయగలమో తెలుసుకునేందుకు వచ్చాను. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను."అని రాహుల్ హాల్ ఎంప్లాయిస్తో అన్నారు.
హాల్ భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక ఆస్తి అని పేర్కొన్న రాహుల్ గాంధీ ఎయిరోస్పేస్ రంగంలో హాల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హాల్ సాదాసీదా కంపెనీ కాదని చెప్పిన కాంగ్రెస్ యువరాజు... దేశం ఈ సంస్థకు ఎంతో రుణపడి ఉందన్నారు. భవిష్యత్తులో కేవలం భారత్, చైనాలు మాత్రమే అమెరికాతో పోటీపడగలవని ఆదేశ మాజీ అధ్యక్షుడు ఒబామా చెప్పినట్లు గుర్తుచేసిన రాహుల్ ఇందుకు కారణం హాల్ అని చెప్పక తప్పదన్నారు.