ఆమె కల నిజమైంది : 48 ఏళ్ల తర్వాత రాజమ్మను కలిసిన రాహుల్...
వయనాడ్ : కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ మహిళకు సర్ప్రైజ్ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత వయనాడ్లో నివాసముంటున్న పెద్దావిడ ఇంటికి అతిథిగా వెళ్లి ఆశ్చర్య పరిచారు. ఇంతకీ ఆమె ఎవరు? రాహుల్ ఆమె ఇంటికి ఎందుకు వెళ్లారు?
రాహుల్ ఆశ్చర్యపరిచిన ఆ పెద్దావిడ పేరు రాజమ్మ . నర్సుగా ఉద్యోగ విరమణ చేసిన వయనాడ్లో నివాసముంటున్నారు. 1970లో రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో ట్రైనీ నర్సుగా విధులు నిర్వహించారు. అదే ఏడాది జూన్ 19న సోనియా గాంధీ డెలివరీ కోసం ఆ హాస్పిటల్లో చేరారు. ఆమెకు ప్రసవం చేసిన బృందంలో రాజమ్మ కూడా ఒకరు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మనవడైన రాహుల్ గాంధీ పుట్టిన తర్వాత తొలిసారి ఎత్తుకున్న వ్యక్తి రాజమ్మ. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసి ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అవకాశం వస్తే రాహుల్ను కలిసి ఆయన పుట్టిన రోజు నాడు జరిగిన విషయాలు చెబుతానని అన్నారు.
వయనాడ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి రాజమ్మ గురించి తెలియడంతో ఆమెను కలుసుకుని సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. రాజమ్మను ఆప్యాయంగా పలకరించిన రాహుల్ గాంధీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రాహుల్ గాంధీ తన ఇంటికి వస్తారని కలలో కూడా ఊహించలేదని, ఇప్పుడది నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. పుట్టిన రోజు నాడు జరిగిన విషయాలను రాజమ్మ రాహుల్తో పంచుకున్నారు.
As CP @RahulGandhi's third day begins, he shares a light moment with Rajamma, a retired nurse present at the time of his birth.#RahulGandhiWayanad pic.twitter.com/MxvqYJEfRz
— Rahul Gandhi - Wayanad (@RGWayanadOffice) June 9, 2019
రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన కల అంటున్న రాజమ్మ.. ఆయన పౌరసత్వంపై ఆరోపణలు వచ్చినప్పుడు సైతం స్పందించారు. రాహుల్ ఢిల్లీలోనే పుట్టాడని, అందుకు తానే సాక్ష్యమని చెప్పారు. ఆయన భారతీయుడేనన్న విషయాన్ని ఎక్కడ, ఎవరి ముందు చెప్పేందుకైనా సిద్ధమని ప్రకటించారు.