హత్రాస్ : బాధిత కుటుంబంతో రాహుల్,ప్రియాంక... పోరాటం ఆగదని ప్రకటన...
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ఎట్టకేలకు హత్రాస్లోని బూల్గర్హిలో ఉన్న గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. దాదాపు అరగంట సేపు ఆ కుటుంబంతో భేటీ అయ్యారు. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు... అత్యాచార ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు.
Recommended Video
భేటీ అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. 'ఆ కుటుంబం తమ కూతురి కడసారి చూపుకు కూడా నోచుకోలేదు. జరిగిన ఘటనపై ఆ కుటుంబం జ్యుడీషియల్ విచారణ కోరుతోంది. ఇప్పుడున్న జిల్లా మెజిస్ట్రేట్ను తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. అలాగే తమకు రక్షణ కల్పించాలని వారు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇకనైనా తన బాధ్యతను గుర్తెరగాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకూ మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.' అని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ప్రపంచంలో ఏ శక్తి ఆ కుటుంబ గొంతును నొక్కలేదన్నారు.
రాహుల్,ప్రియాంక రాకతో ఆ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. గురువారం(అక్టోబర్ 1) చోటు చేసుకున్న హైడ్రామా,ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం(అక్టోబర్ 3) కూడా రాహుల్ను హత్రాస్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే చివరి నిమిషంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు రాహుల్ వెళ్లేందుకు అనుమతించింది. కేవలం ఐదు మందితో మాత్రమే హత్రాస్కు వెళ్లాలని సూచించింది. దీంతో ప్రభుత్వ సూచనల మేరకు కేవలం ఐదు మందితో మాత్రమే రాహుల్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు.
సెప్టెంబర్ 14న బాధితురాలు గ్యాంగ్ రేప్కు గురవగా అక్కడి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. గ్యాంగ్ రేప్ ఘటన ప్రముఖుల దృష్టిని ఆకర్షించేదాకా బాధితురాలికి సరైన వైద్య సదుపాయం కూడా అందించలేదన్న ఆరోపణలున్నాయి.పైగా, కుటుంబ సభ్యులను కూడా అనుమతించకుండా రాత్రికి రాత్రే బాధితురాలి మృతదేహానికి అధికారులు,పోలీసులు కలిసి అంత్యక్రియలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇరుకునపడింది. దీనిపై వివాదం కొనసాగుతుండగానే బాధిత కుటుంబాన్ని ఎవరూ కలవకుండా నియంత్రించడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం శనివారం హత్రాస్లోకి మీడియాను,ప్రజా ప్రతినిధులను అనుమతించింది.
అంతకుముందు,గురువారం రాహుల్ హత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాలి నడకనే రాహుల్ హత్రాస్ వెళ్లేందుకు సిద్దపడ్డారు. అయినప్పటికీ పోలీసులు అనుమతించకపోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాహుల్ను పోలీసులు కిందకు తోసేయడం వివాదాస్పదమైంది. ఈ దేశంలో రోడ్డుపై నడిచే హక్కు కేవలం బీజేపీ,ఆర్ఎస్ఎస్ నేతలకు మాత్రమే ఉందా అని రాహుల్ ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో రాహుల్,ప్రియాంక సహా 153 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై యూపీ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.
The family wants a judicial inquiry into the incident and removal of the District Magistrate. They also want security: Congress' Priyanka Gandhi Vadra https://t.co/gpRpq8FdbC
— ANI UP (@ANINewsUP) October 3, 2020