నేడే అమేథీలో రాహుల్ నామినేషన్..! భారీ రోడ్ షో కి కసరత్తు చేస్తున్న నేతలు..!!
లక్నో/హైదరాబాద్ : దక్షిణ భారత దేశంలో ప్రచారం ఓ కొలిక్కి రావడంతో జాతీయ రాజకీయ నేతల ఇప్పుడు ఉత్తర భారతం పై ద్రుష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఉత్తర భారతంలో నామినేషన్ల ప్రక్రియకు సమయం మించిపోతుండడవంతో నేతలు ఆ పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అమేధి లోక్సభ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గాంధీల కుటుంబానికి కంచుకోట అమేధిలో రాహుల్ ఇప్పటికి మూడుసార్లు గెలుపొందారు. కాగా రాహుల్ నామినేషన్ సందర్భంగా పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు.
రాహుల్ నామినేషన్ సందర్భంగా ఆయన వెంట యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కాంగ్రెస్ ప్రతినిధి అనిల్ సింగ్ వెల్లడించారు. కాగా, నామినేషన్ వేసేముందు రాహుల్ 3 కిమీ పరిధిలో సాగే రోడ్షోలో పాల్గొంటారని సింగ్ తెలిపారు.
మరోవైపు అమేధితో పాటు కేరళలోని వయనాడ్లోనూ పోటీచేస్తున్న రాహుల్ ఇప్పటికే అక్కడ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమేధిలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. గత ఎన్నికల్లోనూ రాహుల్ పై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.