కీలక నేతలతో అమిత్ షా భేటీ: గాలి జనార్ధన్ ముందు బెడిసికొట్టిన వ్యూహం?
బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నాలుగు రోజుల అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్యటన శుక్రవారం మొదలైంది. సోమవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదలతో ఆయన పర్యటన ముగుస్తుంది! గురువారం రాత్రి బెంగళూరు చేరుకున్న అమిత్ షా కీలక నేతలతో భేటీ అయ్యారు. ప్రచారం, గెలుపోటములపై నేతలతో మంతనాలు జరిపారు.
Recommended Video
మరోవైపు, బళ్లారిలో అమిత్ షా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో పార్టీకి ఏవిధమైన సంబంధం లేదని ఇదివరకు ఆయన ప్రకటించారు. మొలకాల్మూరుతో పాటు బళ్లారిలో పలువురు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం గాలి పని చేస్తున్నారు. వారు గాలి అనుచరులుగా చెబుతున్నారు.
గాలికి అమిత్ షా దూరం
అయితే, గాలి జనార్ధన్ రెడ్డికి దూరం పాటించాలనే అమిత్ షా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బళ్లారి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, అమిత్ షా ఎన్నికల వ్యూహాల్లో గట్టి దిట్ట. 2014 నుంచి ఆయన నేతృత్వంలో బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటోంది. కర్నాటక విషయంలో మాత్రం ఆయన విఫలమైనట్లుగా చెబుతున్నారు.
అమిత్ షా చాణక్యం బెడిసికొట్టిందా?
చివరి క్షణంలో గాలి జనార్ధన్ రెడ్డి వర్గం టిక్కెట్లు దక్కించుకోవడం, వలస నేతలకు పెద్ద పీట వేయడం.. నేపథ్యంలో అమిత్ షా చాణక్యం ఇక్కడ బెడిసికొట్టిందా అనే ప్రచారం సాగుతోంది. కర్నాటకలో గెలుపు గుర్రాలను నిర్ణయించేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అమిత్ షా మొత్తం 224 నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు.
సర్వే చేయించారు
కర్నాటకలో అమిత్ షా నాలుగు సర్వేలు చేయించారు. మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు టిక్కెట్లు ఉంటాయని సంకేతాలు పంపించారు. ఉత్తర ప్రదేశ్ తరహా ఫార్ములాను కర్నాటకలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. కానీ కొన్ని స్థానాల్లో మాత్రం ఆయన అంచనాలు తారుమారయ్యాయని అంటున్నారు.
బీజేపీలో అసంతృప్తులు
తొలి జాబితా విడుదల అయినప్పుటే అసంతృప్తి బయటపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వలస నేతలకు టిక్కెట్లు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన జాబితాలు కూడా అసంతృప్తిని రగిల్చాయి. అయితే యెడ్యూరప్ప మిత్రురాలిని, కొడుకును దూరం పెట్టడం ద్వారా అనుకూల సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ గాలి అనుచరులకు టిక్కెట్ దక్కడం బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టింది. కాంగ్రెస్ పార్టీలోను అసంతృప్తులు లేకపోలేదు.
అమిత్ షా - రాహుల్ మాటల యుద్ధం
కర్నాకలో రాహుల్ గాంధీ, అమిత్ షాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జాతీయ గీతాన్ని గౌరవించలేని వారికి రాజకీయాల్లో చోటు లేదని అమిత్ షా మండిపడగా, గాలి జనార్ధన్ రెడ్డి బ్రదర్స్ పైన మోడీ ఎందకు మాట్లాడటం లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యెడ్డీ, అమిత్ షా తనయుడి గురించి మోడీ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. రెడ్డి బ్రదర్స్కు, అనుచరులకు 8 టిక్కెట్లు ఇచ్చారన్నారు.