రాహుల్ కు కురియన్ కష్టాలు..! తర్జుమా చేయలేక తల్లడిల్లుతున్న స్థానిక నేతలు..!!
Recommended Video
తిరువనంతపురం/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్నారు. పతనంథిట్టలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న వేళ, దాన్ని అనువదించిన కురియన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చూస్తున్న వారిలో నవ్వులు పూయిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవమున్న కురియన్, రాహుల్ ఆంగ్లాన్ని అర్థం చేసుకోవడంలో పడ్డ కష్టం అంతాఇంతా కాదు.
రాహుల్ కు చుక్కలు చూపించిన కురియన్..! అనువాదంలో ఆరు చెరువుల నీళ్లు తాగిన పెద్దాయన..!!
చాలాసార్లు తడబడుతున్న కురియన్ ను చూసి, కాసేపు నవ్వు మొహంతోనే కనిపించిన రాహుల్ , చివరకు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓ దశలో తన మైక్ ను పక్కకు నెట్టి, మళయాలంలో మాట్లాడేందుకు కురియన్ ప్రయత్నించగా, రాహుల్ వారించాల్సి వచ్చింది. అయితే అనువాదం సరిగ్గా లేకపోవడంతో ఒక దశలో రాహుల్ కాస్త అసహనానికి గురైనట్లు కన్పించారు. కురియన్ బదులుగా మరొకరిని ట్రాన్స్లేట్ చేయమని కోరినట్లు తెలుస్తోంది.
చుక్కలు చూపించిన జేజెమ్మ..! చిరాకు పడ్డ రాహుల్..!!
ఇక ఆమద్య తెలంగాణ గడ్డ మీద జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా రాహుల్ గాంధీకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ముందస్తు ఎన్నికల సందర్బంగా గద్వాల లో జరిగిన బహిరంగ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తెలుగులో తర్జుమా చేయడానికి డికే అరుణ మూడుచెరువుల నీళ్లు తాగినంత పనైంది. పొంతనలేని తర్జుమా చేస్తూ రాహుల్ గాంధీకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది అరుణమ్మ. తాజాగా కేరళలో జరిగిన ఉాదంతం పట్ల రాహుల్ గాంధీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
భాష అర్థం కాక కొందరు, వినపడక కొందరు ఇబ్బందులు..! జనాల్లో అబాసు పాలు..!!
దక్షిణాదిలో ప్రచారం జాతీయ పార్టీల నేతలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా అగ్రనేతల ప్రసంగాలను తర్జుమా చేయడంలో స్థానిక నేతలు ఇబ్బందులు పడుతున్నారు మరీ ముఖ్యంగా కేరళలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఆ పార్టీ సీనియర్ నేత తర్జుమా చేశారు. అయితే రాహుల్ చెబుతున్నదాన్ని అందుకోలేక అభాసుపాలయ్యారు. అయితే రాహుల్ ఎంతో ఓపికతో ఆ పెద్దాయనకు సర్దిచెప్పారు.
ఒక్క కాంగ్రెస్సే కాదు..! ఇతర పార్టీనేతలకు కూడా పడరాని పాట్లు..!!
మరోవైపు సీపీఎం నాయకురాలు బృందా కారత్కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆమె చెబుతున్న విషయాన్ని మళయాలంలో చెప్పడంలో స్థానిక నేత విఫలమయ్యారు. దీంతో బృందాకారత్ అసహనానికి లోనయ్యారు. పదే పదే తర్జుమా చేసే నాయకుడు తన ప్రసంగాన్ని అర్థం చేసుకోలేకపోవడంతో బృందాకారత్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి అనువాదం చాలులే అన్నట్లు చెప్పారు.