రాహుల్ తప్పుడు భాషకు జవాబు చెప్పను: సుష్మా, భర్తలపై మహిళలకు డొక్లాం పాఠం!
డోక్లామ్ విషయంలో చైనాతో భారత్ అనుసరించిన విధానాన్నే భర్తల విషయంలోనూ అనుసరించాలని విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ మహిళలకు పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: డోక్లామ్ విషయంలో చైనాతో భారత్ అనుసరించిన విధానాన్నే భర్తల విషయంలోనూ అనుసరించాలని విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ మహిళలకు పిలుపునిచ్చారు.
ఉద్యోగం చేసేందుకు ఫ్యామిలీ ఒప్పుకోకుంటే
బిజెపి ఆధ్వర్యంలో అహ్మదాబాద్లో నిర్వహించిన మహిళా సమ్మేళనంలో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడారు. ఉద్యోగం చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పకోకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు.
డొక్లాంలో భారత్ అనుసరించిన వైఖరి
ఆ మహిళకు సుష్మా స్వరాజ్ సమాధానం చెప్పారు. ఉద్యోగం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తొలుత వారికి వివరించాలని, అప్పటికీ వినకపోతే డోక్లామ్ విషయంలో చైనాపై భారత్ అనుసరించిన శాంతియుత విధానాన్ని అనుసరించి దారికి తెచ్చుకోవాలని నవ్వుతూ చెప్పారు.
శాంతియుతంగా డొక్లామ్ సమస్య పరిష్కారం
ఈ సందర్భంగా డోక్లామ్ విషయంలో భారత్-చైనా దేశాల మధ్య రెండు నెలలపాటు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి వివరించారు. చివరికి శాంతియుతంగా సమస్య పరిష్కారమైందన్నారు. మహిళలకు భద్రత, స్వేచ్ఛ, సాధికారత చాలా ముఖ్యమన్నారు.
రాహుల్ తప్పుడు భాషకు సమాధానం చెప్పే ప్రసక్తి లేదు
ఆరెస్సెస్లో మహిళలు నిక్కర్లు ధరించడం చూశారా? అన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుష్మ స్పందించారు. ఆరెస్సెస్లోని మహిళలు నిక్కర్లు ఎందుకు ధరించరని రాహుల్ సూటిగా అడిగి ఉంటే సమాధానం చెప్పి ఉండేదాన్ని అని సుష్మ అన్నారు. ఆయన అలా ప్రశ్నించడం సరికాదని, తప్పుడు భాష ఉపయోగించిన ఆయనకు బదులిచ్చే ప్రసక్తే లేదన్నారు.