ఉత్తరాది పొమ్మంది .. దక్షిణాది అదరించింది : వాయనాడులో ఎగిరిన కాంగ్రెస్ జెండా
హైదరాబాద్ : ఉత్తరాది పొమ్మని పంపించగా .. దక్షిణాది మేమున్నామంటూ అక్కున చేర్చుకుంది. కానీ గతంలో కన్నా భారీ మెజార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీలో 23 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే తొలిసారి పోటీచేసిన వయనాడు నుంచి విజయం అందుకొన్నారు.
అమేథీ కోటలో బీజేపీ ..
కాంగ్రెస్ కంచుకోట అమేథీ. స్వతంత్ర్య భారతదేశంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతినిధులే విజయం సాధించారు. ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఇతర పార్టీలు విజయం సాధించాయి. 1977లో జనతాపార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్, 1998లో బీజేపీకి చెందిన సంజయ్ సింగ్ విజయం సాధించారు. 1999లో సోనియా ఇక్కడినుంచే పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కుమారుడు రాహుల్ కోసం సీటు కేటాయించగా 2004, 2009, 2014లో వరుసగా మూడుసార్లు రాహుల్ విజయం సాధించారు.
దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!
స్మృతి ఇరానీ ఎందుకంటే ..?
ఈసారి స్మృతి ఇరానీ విజయబావుటా ఎగురేశారు. ఇందుకోసం ఆమె చాలానే కష్టపడ్డారు. 2014లో ఓడిపోయిన .. అమేథీ ప్రజలతో మమేకయ్యారు. సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఎన్నికలకు ముందే రైఫిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. దీంతో స్థానికంగా ఉండే యువతకు ఉపాధి లభిస్తోందని తెలిపారు. ఆమె చెప్పిన హామీలను అమేథీ ప్రజలు విశ్వసించి .. గెలిపించారు.
ఆదరించిన దక్షిణాది
రాహుల్ను ఉత్తరాది ప్రజలు తిరస్కరిస్తే దక్షిణాది అక్కున చేర్చుకుంది. అమేథీలో రాహుల్ ఓడిపోగా .. వాయనాడు ప్రజలు మాత్రం భారీ మెజార్టీతో గెలిపించారు. తన ప్రత్యర్థి సీపీఐ నేత సునీర్పై 4 లక్షల 28 వేల 613 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాయనాడులో రాహుల్కు 6 లక్షల 99 వేల 907 ఓట్లు పోల్ కాగా .. సునీర్కు 2 లక్షల 71 వేల 294 ఓట్లు పడ్డాయి.
ఇవీ మెజార్టీలు ..
ఇక రికార్డు మెజార్టీలను పరిశీలిస్తే బీడ్ లోక్ సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ పాటిల్ పై బీజేపీ నేత ప్రితమ్ గోపినాథ్ రావు 6 లక్షల 96 వేల 321 ఓట్లతో గెలుపొందారు. తర్వాత పశ్చిమ బెంగాల్లో సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5 లక్షల 92 వేల 502 ఓట్లతో గెలిచి రెండో స్థానంలో ఉన్నారు. 2014లో వడోదర నుంచి ప్రధాని మోదీ 5 లక్షల 70 వేల 128 ఓట్లతో ... 2011 ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ 5 లక్షల 45 వేల 672 ఓట్లతో గెలిచి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.