మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్ నమోదు, ఆపరేషన్ కమల, భారీ మొత్తం!
బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ప్రీతమ్ గౌడ, యడ్యూరప్పకు మీడియా సలహాదారు అయిన ఎంబి. మరంకల్ మీద గురుమిట్కల్ జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడ రాయచూరు జిల్లా ఎస్పీ డి. కిశోర్ బాబుకు ఫిర్యాదు చేశారు.
ఈ నలుగురు తమను బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేశారని. భారీ మొత్తంలో నగదు ఆశ చూపించారని శరణ్ గౌడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బీజేపీలోకి రాకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని బెదిరింపులకు దిగారని ఎమ్మెల్యే కుమారుడు శరణ్ గౌడ జిల్లా ఎస్పీ కిశోర్ బాబుకు ఫిర్యాదు చేశారు.
రాయచూరు జిల్లా ఎస్పీ కిశోర్ బాబుకు సుమారు మూడు పేజీల లేఖలో దేవదుర్గ గెస్ట్ హౌస్ లో ఏం జరిగింది అని పూర్తి సమాచారంతో శరణ్ గౌడ ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే కుమారుడు శరణ్ గౌడ ఫిర్యాదు లేఖతో పాటు ఒక సీడీని జిల్లా ఎస్పీ కిశోర్ బాబుకు ఇచ్చారు.
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తరువాత దేవదుర్గ వెళ్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం చెయ్యడానికి సిద్దం అయ్యారని, బెదిరింపులకు దిగారని, భారీ మొత్తంలో నగదు ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పతో సహ నలుగురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.