త్వరలో నాన్ స్మార్ట్ఫోన్ నుంచీ రైలు టిక్కెట్ బుకింగ్
త్వరలో నాన్న స్మార్ట్ ఫోన్ మొబైల్ను ఉపయోగించే వారు కూడా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆదివారం నాడు తెలిపారు.
న్యూఢిల్లీ: త్వరలో నాన్న స్మార్ట్ ఫోన్ మొబైల్ను ఉపయోగించే వారు కూడా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆదివారం నాడు తెలిపారు. సాధారణ ఫోన్లు ఉపయోగించే వారు కూడా త్వరలో తమ ఫోన్ల ద్వారా రైల్వే టిక్కెట్లు బుకింగ్ చేసుకునే సౌకర్యం తీసుకు వస్తామన్నారు.
అలాగే ఈ వ్యాలెట్స్ను తీసుకు వస్తున్నామని, మొబైల్ అప్లికేషన్స్ ద్వారా చెల్లింపులను ప్రోత్సహిస్తామన్నారు. డిజిటల్ ఇండియా ప్రమోషన్ పైన దృష్టి సారించామన్నారు.
ఇదిలా ఉండగా, వివిధ వర్గాలకు తగ్గింపు ధరలకు రైల్వే టికెట్లను అందిస్తున్న కారణంగా సాలీనా రూ. 33 వేల కోట్లను నష్టపోతున్న భారత రైల్వే.. సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రయాణికులపై భారం మోపాలని భావిస్తోంది.
2017 ఆరంభం నుంచి ప్రయాణ చార్జీలను పెంచాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 2013లో టికెట్ ధరలను పెంచినప్పటికీ, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. 2014లో ప్రయాణ చార్జీలను 14.2 శాతం, సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేరకు ప్రభుత్వం పెంచింది. ఆపై మరో విడత పెంపు జరగలేదు.
ఇప్పుడు ధరలను పెంచేందుకు అనుమతించాలని కోరుతూ రైల్వే శాఖ కేంద్ర క్యాబినెట్కు ఫైల్ను పంపిందని తెలుస్తోంది. టికెట్ ధరల పెంపునకు పార్లమెంట్ అనుమతులు అవసరం లేకపోవడంతో, క్యాబినెట్ నుంచి అనుమతి లభించిన వెంటనే ధరలను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. వచ్చే వారంలో సమావేశమయ్యే కేంద్ర మంత్రివర్గం రైలు టికెట్ ధరల పెంపును సమర్థిస్తూ నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు.