ఏపీ, టీలకి న్యాయమేది: గుత్తా, పెదవి విరిచిన రాహుల్
న్యూఢిల్లీ/హైదరాబాద్: రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి న్యాయం జరగలేదని మాజీ మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం అన్నారు. సదానంద గౌడ రైల్వే బడ్జెట్ పైన ఆయన పెదవి విరిచారు. కొత్తగా ఏర్పాటైన ఏపీకి జోనల్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా తేలేదన్నారు. ఇక రైల్వేశాఖను ప్రైవేటీకరణ చేసే విధంగా ఎన్డీఏ రైల్వేబడ్జెట్ ఉందన్నారు.
రైల్వే బడ్జెట్ అనంతరం నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్లో పారదర్శకత, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలక పాత్ర అన్నారు. తక్కువ సమయంలో దిశానిర్దేశనం చేసిన బడ్జెట్ ఇదే అన్నారు. దేశాభివృద్ధి పట్ల విశ్వాసం కలిగించిన బడ్జెట్ అన్నారు. ఈ రైల్వే బడ్జెట్ రైలు ప్రయాణాన్ని ఆనందమయం చేస్తుందన్నారు.
రైల్వే బడ్జెట్ పైన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. మంత్రి సదానంద గౌడ చేసిన హామీలను అన్నింటిని నెరవేర్చడం సాధ్యం కాదన్నారు. ఈ బడ్జెట్ పేదలకు అనుకూలంగా లేదన్నారు. చాలా రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు.
ఈ రైల్వే బడ్జెట్ అప్రధానమైన అంశాల పైన దృష్టి సారించిందని మాజీ రైల్వే శాఖ మంత్రి పీకే బన్సల్ అన్నారు. లోపాల గురించి ఏకరువు పెట్టిన బడ్జెట్ పరిష్కార మార్గాలు చూపలేదని మరో మాజీ మంత్రి అశ్విన్ కుమార్ విమర్శలు గుప్పించారు.
సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పశ్చిమ బెంగాల్ను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రైల్వే బడ్జెట్లో బెంగాల్కు మొండిచేయి చూపారంటూ ఫేస్బుక్లో వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో బెంగాల్కు కేటాయించింది ఏమీ లేదని, కేంద్రం పశ్చిమ బెంగాల్కు మొండిచేయి చూపిందని మమత అన్నారు. కాగా, రైల్వే బడ్జెట్ను నిరసిస్తూ ఢిల్లీలోని సదానంద గౌడ ఇంటి ముందు పలువురు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.