రైల్వే: ఏంసాధించారని బాబుకు ప్రశ్న, మెట్రోపై మేకపాటి
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్లో ఏం సాధించారని తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు మంగళవారం మండిపడ్డారు.
ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పైన విహెచ్ మండిపడ్డారు. ఒకటి, రెండు రైళ్లు మినహా.. తెలుగు ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కొత్త రాష్ట్రాలకు ఏం రాలేదన్నారు. మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు ప్రయోజనాలు రాబట్టలేకపోయారని మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న వాగ్దానాలు ఏవీ రైల్వే బడ్జెట్లో లేవని, ఇది దురదృష్టకరమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంకు మెట్రో రైలు ఊసేలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల పైన కమిటీ వేశారని, ఆ కమిటీ వివరాలు తెలపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల నుండి ఆదాయం ఉన్నప్పటికీ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎప్పుడూ రిక్తహస్తం చూపిస్తున్నారన్నారు. రైల్వే బడ్జెట్ నిరాశపరిచిందన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారిదే బడ్జెట్ అన్నట్లుగా ఉందన్నారు. కేంద్ర రైల్వే మంత్రి ఒక రాష్ట్రానికి మంత్రి అన్నట్లుగా వ్యవహరించారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
లోకసభ వాయిదా
రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం లోకసభ రెండు గంటలకు వాయిదా పడింది. విపక్షాల ఆందోళనతో మరోసారి మూడు గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం మూడు గంటలకు లోకసభ తిరిగి ప్రారంభమైంది.
అయినా, సభలో పలువురు సభ్యులు స్పీకర్ వెల్ లోకి వెళ్లి పెద్దపెట్టున నినాదాలు చేస్తుండడంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలోనే హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలను ప్ర్రవేశపెట్టారు. అదే సమయంలో పోలవరం ఆర్డినెన్స్ పైన తెరాస సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో, సభ 3.30 గంటలకు వాయిదా పడింది.