రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్: కేంద్రం నిర్ణయంతో 11లక్షలమందికి లబ్ది
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ అందించే కీలక నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
కేంద్రం తాజా నిర్ణయంతో 11 లక్షలమందికిపైగా రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం వెల్లడించారు.
'సుమారు 11లక్షల మందికిపైగా రైల్వే ఉద్యోగులకు బోనస్ అందనుంది. గత ఆరేళ్ల నుంచి రైల్వే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో నిలకడగా ఏటా బోనస్ ఇస్తూ వస్తున్నాం. ఈ ఏడాది కూడా 11.52లక్షల మంది ఉద్యోగులకు 78రోజుల బోనస్ ఇస్తున్నాం' అని జవదేకర్ తెలిపారు.
రైల్వేలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇదొక రివార్డు లాంటిందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. రైల్వే ఉద్యోగులకు సరైన మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు. కాగా, రైల్వే ఉద్యోగులకు బోనస్ కారణంగా ప్రభుత్వంపై రూ. 2,024కోట్ల భారం పడనుంది.