శుభవార్త: 5 రైళ్లలో ఏసీ కోచ్ టిక్కెట్ల ధరలు భారీగా తగ్గింపు
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకులకు శుభవార్త తెలిపింది. అయిదు సౌత్ వెస్టర్న్ రైళ్లలోని ఏసీ కోచ్లు లేదా చెయిర్ కార్స్లలో టిక్కెట్ ధరలు తగ్గించింది. ఏసీ బోగీలు అంటే ఖరీదైన ప్రయాణం. సామాన్యులకు అందని విధంగా ఉంటుంది.
అయితే ఇండియన్ రైల్వేస్ ఏసీ బోగీల టిక్కెట్ ధరలను తగ్గించింది. అందరికీ ప్రయాణం సులువుగా ఉండేందుకు ఇలా తగ్గించింది. సౌత్ వెస్ట్ జోన్లోని అయిదు ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ బోగీలకు టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అయిదు రైళ్లను కర్ణాటకలోని బెంగళూరు, గదగ్, మైసూరు ప్రాంతాల నుంచి నిర్వహిస్తున్నారు.
గదగ్- ముంబై ఎక్స్ప్రెస్ రైలు ఏసీ కోచ్ త్రీ టయర్ స్లీపర్ ప్రయాణ ఛార్జీ ప్రస్తుతం రూ.495గా ఉండగా, దానిని రూ.435కి తగ్గించారు. ఈ తగ్గింపు నవంబరు 11 నుంచి అమల్లోకి వస్తుంది.
మైసూరు - షిర్డీ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగీ టికెట్ ధర ఇప్పుడు రూ.495గా ఉంది. దానిని రూ.260కి తగ్గించారు. డిసెంబరు 3 నుంచి ఇది అమలులోకి వస్తుంది. యశ్వంత్పూర్-బికనీర్ ఎక్స్ప్రెస్ రైలులో మూడు ఏసీ బోగీల్లో టికెట్ ధర రూ.735 ఉంది. దానిని రూ.590కి తగ్గించారు. ఇది నవంబరు 30 నుంచి అమలులోకి రానుంది.
యశ్వంత్పూర్ - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలు టికెట్ ధర రూ.345 ఉంది. దానిని రూ.305కి తగ్గించారు. ఇది నవంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. యశ్వంత్పూర్ - హుబ్లి వీక్లీ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్ టికెట్ ధర రూ.735 ఉండగా దానిని రూ.590కి తగ్గించారు.