ప్రయాణీకులకు శుభవార్త: బ్యాంకులలో రైల్వే టిక్కెట్లు
రైలు టిక్కెట్లను మరింత సులభతరం చేసే ఉద్దేశ్యంలో భాగంగా మరో పెద్ద ముందడుగు పడనుంది. ఇండియన్ రైల్వే.. జనరల్ క్లాస్ టిక్కెట్లను బ్యాంకుల నుంచి కూడా ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
న్యూఢిల్లీ: రైలు టిక్కెట్లను మరింత సులభతరం చేసే ఉద్దేశ్యంలో భాగంగా మరో పెద్ద ముందడుగు పడనుంది. ఇండియన్ రైల్వే.. జనరల్ క్లాస్ టిక్కెట్లను బ్యాంకుల నుంచి కూడా ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
గత ఏడాది (ఆగస్ట్ 2016) నుంచి రైల్వే బోర్డు దీని కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇండియన్ రైల్వేస్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి దీని విధివిధానాలను రూపొందిస్తున్నారు.
ఏప్రిల్ 2017లో ఈ ప్రాజెక్టు తుది రూపు దాల్చనుందని తెలుస్తోంది. ఆ తర్వాత ట్రయల్ ఉంటుంది.
బ్యాంకులలోనే టిక్కెట్లు ఇచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ ముందు రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో ఒకటి.. బ్యాంకులలో ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణీకులను టిక్కెట్లు అందుబాటులో ఉంచడం. రెండోది.. ఏటీఎంలలో మార్పులు చేసి అక్కడి నుంచి రైల్వే టిక్కెట్ బుకింగ్ సిస్టంకు అనుసంధానం చేయడం.
ప్రయాణీకులకు సౌలభ్యం
బ్యాంకులతో అనుసంధానం చేయడం వల్ల ప్రయాణీకులకు టిక్కెట్లు మరింత సులభతరం చేయడమే ఉద్దేశ్యమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల క్యూలను తగ్గించవచ్చునని భావిస్తున్నారు. అంతేకాదు, ప్రయాణీకులకు కూడా పెద్ద పెద్ద క్యూల బాధ తప్పుతుందని చెబుతున్నారు.
జమ్షెడ్పూర్లోని మ్యాంగో పోస్టాఫీస్లో గత అయిదేళ్లుగా జనరల్ టిక్కెట్లను విక్రయిస్తున్నారు. అంతేకాదు, మ్యాంగోలో బస్ స్టాండ్ వద్ద రైల్వేస్ ఏర్పాటు చేసిన కౌంటర్ల నుండి కూడా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.
టాటా నగర్ రైల్వే స్టేషన్లో రెండు సీవోఏటీవీఎంలు ఉన్నాయి. ఇక్కడ నోట్లను, కాయిన్స్ను, స్మార్ట్ కార్డులను ఉపయోగించి ఇక్కడ జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. టాటా నగర్లో ప్రతి రోజు 15వేల జనరల్ టిక్కెట్లు విక్రయిస్తుంటారు.
మ్యాంగోలోని బస్టాండులోని పోస్టాఫీసులో 500కు పైగా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. సీవోఏటీవీఎంల నుంచి దాదాపు 150 టిక్కెట్లు విక్రయిస్తున్నారు.