రిషిపై మైత్రేయి ఫిర్యాదు: కార్తిక్ గౌడపై అరెస్టు వారెంట్
బెంగళూర్: రైల్వే మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తిక్ గౌడను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అతనిపై అరెస్టు వారెంట్, లుకౌట్ నోటీసు జారీ అయ్యాయి. బెంగళూర్ కోర్టు గురువారంనాడు వాటిని జారీ చేసింది.
దీంతో పోలీసులు ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చునని అంటున్నారు. కార్తిక్ గౌడపై నటి మైత్రేయి మోసం, అత్యాచారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రెండో నోటీసుకు కూడా కార్తిక్ ప్రతిస్పందించి పోలీసుల ముందుకు రాలేదు. రెండో నోటీసు కాలపరిమితి బుధవారంతో ముగిసింది.
ఇదిలావుంటే, నటి మైత్రేయి ఆర్టీ నగర్ పోలీసులకు బుధవారం రాత్రి మరో ఫిర్యాదు చేసింది. మీడియాలో తన ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ ఆమె దర్శకుడు రిషిపై, నేహాల్ గౌడపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మైత్రేయి ఫిర్యాదును తాము అందుకున్నామని, న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.