తప్పిపోయిన బాలిక ఇంటికి చేర్చిన సురేశ్ ప్రభు ట్వీట్
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పనితీరు చాలా చక్కగా ఉందంటూ రైల్వే ప్రయాణికుల నుంచి ఆయన అభినందనలు అందుకుంటున్నారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చూపిన చొరవతో తప్పిపోయిన ఓ బాలిక కేవలం కొన్ని గంటల్లోనే తల్లిదండ్రుల వద్దకు చేరేలా చేశారు.
వివరాల్లోకి వెళితే... రెండు రోజుల క్రితం హర్యానాకు చెందిన అవని అనే బాలిక తన కుటుంబ సభ్యుల నుంచి రైల్వే స్టేషన్లో తప్పిపోయింది. తప్పిపోయిన బాలికను రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మహిళా కానిస్టేబుల్ గుర్తించారు. దీంతో పాపను రైల్వే పోలీసులు తమ వద్ద ఉంచుకుని ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
దీంతో ఈ విషయం కాస్త రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు చేరవేశారు. దీనిపై స్పందించిన సురేశ్ ప్రభు తప్పిపోయిన అవని అనే పాప తమ దగ్గర క్షేమంగానే ఉందని ఆమె చిత్రాలను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. చిన్నారి తల్లిదండ్రులు తమను సంప్రదించాల్సిందిగా పూర్తి వివరాలతో ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పోస్ట్ చేసిన దానిని సుమారు 30 లక్షల మంది చూశారు. అంతేకాదు సోషల్ మీడియాలోని వివిధ వెబ్ సైట్లలో 32,275 మంది దాన్ని షేర్ చేశారు. దాదాపు 25,000 మంది ఆ పోస్ట్ని లైక్ చేశారు. ఇంకేముంది తొమ్మిది గంటల్లోనే ఆ పాప తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.
అనంతరం తమ పాప ఆచూకీ తెలిపి, తమ వద్దకు క్షేమంగా చేరుకునేలా చేసినందుకు గాను బాలిక తల్లిదండ్రులు ట్విట్టర్లో సురేశ్ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపారు.