తెలుగు రాష్ట్రాల ప్రజలకు పౌరసత్వ ఎఫెక్ట్... పలు రైళ్ల రద్దు
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సైతం తాకిన విషయం తెలిసిందే... బెంగాల్ నిరసనకారులు పెద్ద ఎత్తున రైళ్లను సైతం తగులబెట్టారు. రైల్వే స్టేషన్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బెంగాల్ సెగ ప్రస్తుతం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను కూడ తాకాయి. దీంతో బెంగాల్ గుండా ప్రయాణించే పలు రైళ్లు రద్దయ్యాయి.
రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందే బుక్ చేసుకున్న వారు, ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకున్నవారి పరిస్థతి ఇబ్బందిగా మారింది. దీంతో కొంతమంది ప్రయాణికులు తమ నిరసన సైతం వ్యక్తం చేశారు. బెంగాల్లో జరుగుతున్న రైల్ రోకోతో పలు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటిని రూటు మళ్లించారు. రైల్ రోకోతో ఏపీకి రావాల్సిన రైళ్లు రద్దయ్యాయి.
మరోవైపు ఇక్కడి నుండి వెళ్లాల్సిన రైళ్లను కూడ దక్షిణమధ్య రైల్వే అధికారులు నిలిపి వేశారు. దీంతో విశాఖ రైల్వే స్టేషన్తోపాటు హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరాల్సిన రైళ్లు కూడ రద్దయ్యాయి. ముఖ్యంగా హౌరాకు వెళ్లాల్సిన ఫలక్నుమా, కోరమండల్ , హౌరా ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపివేశారు.
వీటితోపాటు హౌరా-తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్, హౌరా-ఎర్నాకులం అంత్యోదయ ఎక్స్ప్రెస్, హౌరా-యశ్వంత్పూర్ దురంతో, హౌరా- హైదరాబాద్ ఈస్ట్కోస్ట్, హౌరా-ముంబై గీతాంజలి ఎక్స్ప్రెస్, హౌరా-పూరీ శ్రీజగన్నాథ్ ఎక్స్ప్రెస్, సత్రాగచ్చి-పూరీ ఎక్స్ప్రెస్, హౌరా-పూరీ వీక్లీ, పూరీ-కన్యాకుమారి ఎక్స్ప్రెస్, తిరుపతి-హౌరా, యశ్వంత్పూర్-హౌరా, హైదరాబాద్-హౌరా రైళ్లు రద్దయ్యాయి. పూరీ-హౌరా శతాబ్ది రైలు సర్వీసును కూడా రద్దుచేశారు.