150 చోట్ల సీబీఐ దాడులు..ఈ సారి టార్గెట్ ఇవే..!
న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ కొరడా ఝుళిపిస్తోంది. దేశవ్యాప్తంగా 150 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేశాఖ, బొగ్గు శాఖ జీఎస్టీ కార్యాలయాలు వంటివి ఉన్నాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందన్న అనుమానం రావడంతో సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విపరీతంగా జరుగుతోందన్న సమాచారం అందుకున్న సీబీఐ వీటిపై కన్నెర్ర చేసింది.
అవినీతికి తెరుచుకున్న దారులు, ప్రభుత్వ పరంగా ఏమైనా సేవలు కావాలంటే అందుకు అధికారులు సామాన్య ప్రజలను లంచాలు అడుగుతూ వేధిస్తున్నారన్న సమచారం రావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. ఇక సీబీఐ దాడులు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఉన్నాయి. రైల్వేశాఖ, బొగ్గు శాఖ, కస్టమ్ శాఖ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విద్యుత్ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ఈఎస్ఐసీ, రవాణా శాఖ, సీపీడబ్ల్యూడీ, అగ్నిమాపక శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఎస్టేట్స్, సబ్రిజిస్ట్రార్ ఆఫీసు, జీఎస్టీ డిపార్ట్మెంట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాలు, షిప్పింగ్, బీఎస్ఎన్ఎల్, స్టీల్ సంస్థలు, ఎన్హెచ్ఏఐ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.
ఇక అందరికీ షాకిస్తూ దాడులు చేసిన సీబీఐ ప్రధాన నగరాలైన ఢిల్లీ, జైపూర్, జోద్పూర్, గౌహతి, శ్రీనగర్, షిల్లాంగ్, చండీగఢ్, షిమ్లా, చెన్నై, మదురై, కోల్కతా, హైదరాబాదు, బెంగళూరు, ముంబై, పూణే, గాంధీనగర్, గోవా, భోపాల్, జబల్పూర్, నాగ్పూర్, పాట్నా, రాంచీ, గజియాబాద్, డెహ్రాడూన్, లక్నో నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది సీబీఐ .
ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంను సీబీఐ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగిస్తూ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ హై ప్రొఫైల్ కేసులో విచారణ చేస్తుండగానే దేశవ్యాప్తంగా 150 చోట్ల అది కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.