ఇలాక్కూడా రవాణా: అయిదేళ్ల పిల్లాడి కోసం కదిలిన రైల్వే: 350 కిలోమీటర్ల దూరం..!
బెళగావి: కరోనా వైరస్ కుమ్మేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాలు బయట పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. సరైన ప్రిస్కిప్షన్ లేనిదే మందులను సైతం కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇలాంటి వాతావరణం మధ్య అయిదేళ్ల పిల్లాడి ప్రాణాలను నిలపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఆ బాలుడి ఆరోగ్యం కుదుట పడటానికి అవసరమైన కొన్ని రకాల మందులను అత్యవసరంగా పంపిణీ చేసింది. ఆ మార్గంలో వెళ్లే గూడ్స్ రైలులో వాటిని పంపించింది.
రాచకొండ పోలీసుల సాహసం: మంటల్లో చిక్కుకున్న గేదెలను కాపాడిన వైనం: అగ్ని కీలలను లెక్క చేయక
కర్ణాటకలోని బెళగావిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెళగావికి చెందిన ఆ బాలుడి కోసం పుణే నుంచి మందులను తెప్పించింది రైల్వేశాఖ. రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న లోక్సభ నియోజకవర్గం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఆదేశాలతో నైరుతి రైల్వే అధికారులు సుమారు 350 కిలోమీటర్ల దూరం ఉన్న పుణే నుంచి ఈ మందులను తెప్పించారు. ఆ బాలుడి ప్రాణాలను నిలపగలిగారు.
బెళగావికి చెందిన ఆ బాలుడు కొంతకాలంగా పుణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. తల్లిదండ్రులు.. ఆ బాలుడితో సహా బెళగావికి చేరుకున్నారు. అప్పట్లో వెంట తెచ్చుకున్న మందులు అయిపోవడంతో మళ్లీ పుణే నుంచి వాటిని తెప్పించుకోవాల్సి వచ్చింది. లాక్డౌన్ కొనసాగుతున్నందున.. పుణేలోని తమ బంధవుల ద్వారా రోడ్డు మార్గంలో వాటిని తెప్పించుకోవడానికి అవకాశాన్ని కల్పించాలని ఆ బాలుడి తల్లిదండ్రులు మహారాష్ట్ర పోలీసులను ఆశ్రయించారు.
ఈ సమాచారం స్థానిక లోక్సభ సభ్యుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడికి తెలిసింది. దీనితో ఆయన వెంటనే స్పందించారు. తల్లిదండ్రులను సంప్రదించారు. బాలుడికి అవసరమైన మందుల వివరాలను నైరుతి రైల్వే అధికారులకు తెలియజేశారు. యుద్ధ ప్రాతిపదికన ఈ మందులను పుణే నుంచి తెప్పించాలని ఆదేశించారు. దీనితో అధికారులు పుణే నుంచి బెళగావి మీదుగా రాకపోకలు సాగించే గూడ్స్ రైలులో ఈ మందులను తరలించారు. సకాలంలో వాటిని చేరవేయగలిగారు.
Recommended Video