ఫ్లెక్సీ ఫేర్పై శుభవార్త: రైల్వే ప్రయాణీకులకు దీపావళి బహుమతి, గోయల్ ట్వీట్
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు ఆ శాఖ దీపావళి కానుక ఇస్తోంది. ఫ్లెక్సీ ఫేర్ పేరుతో అంటే అవసరాలకు అనుగుణంగా ఛార్జీలు నిర్ణయించి, ప్రయాణీకులపై భారం మోపే బాధ నుంచి ప్రయాణీకులకు ఊరట లభించే నిర్ణయం తీసుకుంది.
ఇక మీదట 15 ప్రీమియం రైళ్లలో వసూలు చేసే ఫ్లెక్సీ ఫేర్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ప్రకటన చేశారు. 101 రైళ్లలో వసూలు చేసే ఫ్లెక్సీ ఫేర్ను 1.5 నుంచి 1.4 రెట్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు.
పండుగ సీజన్లో బహుమతి
ఈ పండుగ సీజన్లో రైల్వే ప్రయాణీకులకు బహుమతి ఇస్తున్నామని, ప్రీమియం రైళ్లలో ప్లెక్సీ ఫేర్ కింద వసూలు చేసే ఛార్జీలను 1.5 రెట్ల నుంచి 1.4 రెట్లకు తగ్గిస్తున్నామని తెలిపారు. యాభై కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ను పూర్తిగా తొలగిస్తున్నామని చెప్పారు.
ఫ్లెక్సీ ఫేర్ తగ్గించడం వల్ల ప్రయాణీకులకు లాభం
ఫ్లెక్సీ ఫేర్ తగ్గించడం వల్ల ప్రయాణికులకు లాభం చేకూరుతుందని పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే రైళ్లలో ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబరు 9, 2016న రైల్వే శాఖ ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చింది.
విమాన ఛార్జీల కంటే రైలు ప్రయాణ ఛార్జీలో ఎక్కువ అనే ఆరోపణలు
రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ పథకం కింద ప్రతి 10 శాతం సీట్లకు కొంత ధరను పెంచుతూ పోతారు. ఇలా చేయడం విమాన ఛార్జీల కంటే రైలు ప్రయాణ ఛార్జీలేఎక్కువగా ఉందనే ఆరోపణలు వినిపించాయి.
కాగ్ నివేదిక
దీనిపై కాగ్ కూడా నివేదికను రూపొందించింది. ఈ పథకం తీసుకు రాకముందు రైళ్లలో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు తక్కువగా అయిందని, దీని వల్ల రైల్వేశాఖతో పాటు ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారని కాగ్ తన నివేదికలో పేర్కొంది.