రైల్వే సంచలన నిర్ణయం: మోడీ ప్రసంగం ముగిసిన వెంటనే వెల్లడి: పాసింజర్ రైళ్లపై..
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉంటోన్న లాక్డౌన్ను వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన మరుక్షణమే రైల్వేశాఖ అధికారులు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. జాతిని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగం ముగిసిన వెంటనే రైల్వే అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.
Recommended Video
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లేవీ తిరుగాడట్లేదు. నరేంద్ర మోడీ తొలిసారిగా 21 రోజుల లాక్డౌన్ను ప్రకటించిన వెంటనే రైల్వే అధికారులు ప్యాసింజర్ రైలు సర్వీసులను రద్దు చేశారు. అయితే గూడ్స్ రైళ్లు మాత్రం నడుస్తున్నాయి. ఇవి నిత్యావసర వస్తువులను ఆయా ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ఇదే పరిస్థితిని ఇక మే 3వ తేదీ వరకు కూడా పొడిగించబోతున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఈ మూడువారాల పాటు పాసింజర్ రైళ్లు పట్టాలెక్కబోవని అన్నారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 14వరకు అన్ని ప్యాసింజర్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన రైల్వే శాఖ అధికారులు తాజాగా ప్రధాని లాక్డౌన్ పొడిగింపు ప్రకటనతో మళ్లీ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే నిత్యావసర వస్తువులను రవాణా చేసే గూడ్సు సర్వీసులు మాత్రం ఆపరేట్ అవుతాయని స్పష్టం చేసింది. ఇక రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు రైల్వేస్టేషన్లలో ఇతర ప్రాంతాల్లో మే 3 అర్థరాత్రి వరకు మూసివేయబడతాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
{document1}