జూన్ 1 నుంచి రైల్వే మరిన్ని కొత్త రూల్స్- భారీగా పెరిగిన అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు..
కరోనా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో జూన్ 1 నుంచి రోజుకు 30 ప్రత్యేక రాజధాని రైళ్లతో పాటు 200 రైళ్లను నడిపేందుకు సిద్ధమైన రైల్వేశాఖ అందుకు తగ్గట్టుగానే రిజర్వేషన్ నిబంధనల్లోనూ పలు మార్పులు చేస్తోంది. దీంతో పాటు కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రైళ్లలో ప్రయాణించే వారికి కఠిన నిబంధనలు విధిస్తోంది. ఇప్పటికే ప్రయాణంతో పాటు రిజర్వేషన్ సమయాల్లో మార్పులు చేసిన రైల్వేశాఖ తాజాగా మరికొన్ని మార్పులు ప్రకటించింది. ఇవి మే 31 నుంచే అమల్లోకి రానున్నాయి.
Recommended Video
జూన్ 1 నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు ఇప్పటికే 30 రోజులకు పెంచిన రైల్వే.. దీన్ని ఈసారి ఏకంగా 120 రోజులకు పొడిగించింది. అదే సమయంలో జూన్ 1 నుంచి నడిచే అన్ని రైళ్లలో పార్శిల్, లగేజీ బుకింగ్స్ కు కూడా అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ నిబంధనలు ఈ నెల 31 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించిన రైల్వేశాఖ మిగిలిన నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టంచేసింది.మరోవైపు రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి కరోనా వ్యాప్తి దృష్టి రైల్వేశాఖ కొన్ని ప్రత్యేక సూచనలు చేస్తోంది.