ప్రమాదాలకు రైల్వేశాఖదే బాధ్యత, పరిహారం చెల్లించాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రైల్లో ప్రయాణీస్తున్న ప్రమాదానికి గురైతే ప్రయాణీకులకు ఆ మేరకు పరిహరాన్ని చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. ప్రయాణీకుల నిర్లక్ష్యం పేరుతో పరిహరాన్ని ఇవ్వకుండా నిలిపివేయకూడదని సుప్రీం రైల్వేశాఖను కోరింది.
రైలు ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో ప్రమాదానికి గురై ప్రాణాపాయం వాటిల్లినా, కాళ్ళు , చేతులు విరిగినా ఆ మేరకు బాధితుడికి పరిహరం చెల్లించాలని సుప్రీం కోర్టు రైల్వేశాఖను ఆదేశించింది.ప్రయాణికులే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అనేందుకు వీలు లేదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారిమన్లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పునిచ్చింది.
ప్రమాదాల బాధితులు రైల్వే శాఖ నుంచి నష్టపరిహారం పొందేందుకు అర్హులని తేల్చింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124 ఏ ప్రకారం బాధితులకు నష్టపరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సి వున్నప్పటికీ, పలు సందర్భాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ పరిహారం ఇవ్వకుండా రైల్వే శాఖ తప్పించుకుంటోంది.
ఓ మహిళ, 2002లో తన భర్త ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడిపోయిన సందర్భంగా తనకు రూ.4 లక్షల రూపాయల నష్టపరిహారం రైల్వే చెల్లించాలని కోరుతూ కోర్టుకు ఎక్కింది. రెండో క్లాస్ ట్రైన్ టిక్కెట్ తీసుకున్న తన భర్త జతన్ గోప్, ప్రయాణికుల రద్దీతో రైలు నుంచి జారీ పడిపోయి మరణించారు.
అయితే గోప్ ప్రయాణికుడు కాదని రైల్వే ట్రాక్పై తిరుగుతూ ఉన్నాడని రైల్వే శాఖ వాదించింది. కానీ జతన్ గోప్ టిక్కెట్ కొనడం తాను చూశానని, తన కళ్ల ముందే రైలు నుంచి పడిపోయి చనిపోయాడని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.